వివేకా మర్డర్.. ఎవ‌రా `ర‌హ‌స్య సాక్షి`

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో సీబీఐ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డిం చింది. తాజాగా కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో `ర‌హ‌స్య సాక్షి` చెప్పారంటూ.. అణు బాంబును పేల్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్తుల గొడ‌వ‌.. రెండో పెళ్లి ర‌గ‌డ‌.. అంటూ.. ఈ హ‌త్య‌కు మార్గాలు వెతికిన ఎంపీ అవినాష్‌రెడ్డి కూట‌మికి భారీ షాక్ ఇస్తూ.. సీబీఐ తాజాగా వెల్ల‌డించిన ఈ ర‌హ‌స్య సాక్షి వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టీ కూడా అస‌లు ఎవ‌రీ ర‌హ‌స్య సాక్షి.. అనే చ‌ర్చ దిశ‌గానే సాగుతోంది. తాజాగా సీబీఐ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో ఏం పేర్కొందంటే.. “2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఆరు మాసాల ముందే క‌డ‌ప ఎంపీ టికెట్ విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. దీనిని ప్ర‌స్తుత ఎంపీ అవినాష్‌రెడ్డికి ఇవ్వాల‌ని వైసీపీ భావిస్తోంది. ఆ స‌మ‌యంలో జోక్యం చేసుకున్న వైఎస్ వివేకానంద‌రెడ్డి.. ఆయ‌న‌కు కానీ, ఆయ‌న కుటుంబానికి కానీ ఎంపీ టికెట్ ఇవ్వరాద‌ని తేల్చి చెప్పారు. ఈ టికెట్‌ను వైఎస్ విజ‌య‌మ్మ‌కు కానీ, ష‌ర్మిల‌కు కానీ ఇవ్వాల‌ని సూచించారు” అని తెలిపింది.

అంతేకాదు.. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌ల‌కు కాకుండా.. ఈ టికెట్‌ను అవినాష్‌రెడ్డికి ఇస్తే.. తాను టీడీపీలోకి వెళ్లిపోతాన‌ని కూడా వివేకానంద‌రెడ్డి బెదిరించిన‌ట్టు సీబీఐ ర‌హ‌స్య సాక్షి చెప్పిన‌ట్టుగా తెలంగాణ హైకోర్టుకు వివ‌రించింది. ఈ టికెట్ విష‌యంలోనే వైఎస్ భాస్క‌ర‌రెడ్డి కుటుంబానికి.. వివేకానంద రెడ్డి తో వివాదం ఏర్ప‌డింద‌ని తెలిపింది. గ‌తంలో 2017లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం.. వివేకానంద‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించార‌ని `ర‌హ‌స్య సాక్షి` చెప్పిన‌ట్టు సీబీఐ పేర్కొంది.

ఈ క్ర‌మంలోనే వివేకానంద రెడ్డి జీవించి ఉంటే త‌మ‌కు ఇబ్బంద‌ని, రాజ‌కీయంగా త‌మ‌కు శ‌త్రువు అవుతాడ‌ని భావించి.. ఆయ‌న‌ను హ‌త్య చేసేందుకు త‌దుప‌రి రెండు నెల‌ల‌కే కుట్ర ర‌చించార‌ని.. సీబీఐ పేర్కొంది. ఈ విష‌యాన్ని అత్యంత కీల‌క‌మైన వ్య‌క్తి నుంచి సేక‌రించామ‌ని, ఆయ‌న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామ‌ని.. ప్ర‌స్తుతం మాత్రం ఇది కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉంటుంద‌ని.. సీబీఐ కోర్టుకు వివ‌రించింది. వ‌చ్చే విచార‌ణ‌లో పూర్తిస్థాయిలో ఈ ర‌హ‌స్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలాన్ని వివ‌రిస్తామ‌ని కూడా చెప్పింది. దీంతో ఈ ర‌హ‌స్య‌సాక్షి ఎవ‌రు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ప్ర‌స్తుతం క‌డ‌ప రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న వ్య‌క్తుల‌పై అంద‌రికీ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో వైసీపీలో ఉండి.. వివేకానంద‌రెడ్డితో స‌న్నితంగా ఉన్న నాయ‌కులు త‌ర్వాత‌.. పార్టీ మారి.. టీడీపీలోకి వెళ్ల‌డం వెనుక కూడా వివేకానంద‌రెడ్డి హ‌స్తం ఉంద‌నే ప్ర‌చారం అప్ప‌ట్లోనే జ‌రిగింది. ప్ర‌స్తుతం వారంతా బీజేపీలో ఉన్నార‌ని స‌మాచారం. దీంతో అంద‌రి వేళ్లూ ఆయా నేత‌ల వైపే చూపిస్తున్నాయి. క‌డ‌ప రాజ‌కీయ క్షేత్రంలో ఒక‌ప్పుడు వైఎస్ కుటుంబానికి మిత్రులుగా ఉన్నప్ప‌టికీ.. జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చనివారు కూడా ఉన్నారు. దీంతో `ర‌హ‌స్య సాక్షి` ఎవ‌రై ఉంటారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండడం గ‌మ‌నార్హం.