తప్పు తారక్‌దే అని తేల్చేశారు

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ముగిసిపోయి వారం కావస్తోంది. కానీ ఆ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడంపై వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తారక్‌ను చాలా ఏళ్ల నుంచి అదే పనిగా నందమూరి, నారా కుటుంబాలు అవమానిస్తున్నాయని.. అతణ్ని తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఈ వేడుకలకు రాకుండా తారక్ మంచి పని చేశాడని.. అయినా ఆల్రెడీ కుటుంబంతో విదేశాలకు వెళ్లే కమిట్మెంట్ ఉన్నవాడు ఈ వేడుకలకు ఎలా వస్తాడని  ఒక వర్గం అంటోంది.

ఐతే విజయవాడలో జరిగిన వేడుకలకు తారక్‌ను ఆహ్వానించలేదని విమర్శించిన వాళ్లు, ఇప్పుడు ఆహ్వానం అందినా హాజరు కాని తారక్‌ను ఎలా సమర్థిస్తారని.. ఎంతో ప్రత్యేకమైన తాత శత జయంతి వేడుకల కంటే పుట్టిన రోజు ట్రిప్ ముఖ్యమా అని మరో వర్గం వాదిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణ కర్త టీడీ జనార్దన్.. ఈ విషయంలో తప్పంతా తారక్‌కే అన్నట్లుగా మాట్లాడారు.

ఎన్టీఆర్‌ను ఈ వేడుకలకు వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానించింది జనార్దనే. అయినా తారక్ రాకపోవడంపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగితే.. వారం రోజుల తర్వాత కలిసే అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉన్నందున ఈ వేడుకలకు రాలేకపోతున్నానని అప్పుడే తారక్ చెప్పగా.. కానీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నయినా చేసుకోవచ్చని.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఒక్కసారే వస్తాయని.. ఇలాంటి అరుదైన సందర్భంలో జరిగే వేడుకలకు వస్తే బాగుంటుందని తాము చెప్పినట్లు జనార్దన్ వెల్లడించారు.

కానీ 22 కుటుంబాలు కలిసి విదేశీ పర్యటనకు వెళ్తున్నామని తారక్ చెప్పి.. తన నిర్ణయం తాను తీసుకున్నాడని జనార్దన్ తెలిపాడు. తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్‌ను కూడా తాము శత జయంతి వేడుకలకు ఆహ్వానించామని.. ఐతే ఆయన కూడా తారక్‌తో పాటే వెళ్లినట్లు ఉన్నారని.. అందుకే తను కూడా రాలేకపోయారనుకుంటున్నామని జనార్దన్ అన్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో తారక్‌దే తప్పని టీడీపీ తరఫున చెప్పినట్లయింది.