మళ్ళీ పెళ్లి ఆగిపోయే ఛాన్స్ ఉందా

ఇంకో ఇరవై నాలుగు గంటల కన్నా తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న మళ్ళీ పెళ్లిని ఆపాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడం హఠాత్ పరిణామం. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎలాంటి జడ్జ్ మెంట్ ఇస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే చివరి నిమిషంలో జరిగే ఇలాంటి వాటికి సానుకూల తీర్పు రావడం చాలా తక్కువ. ఒకవేళ ఆవిడ రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడో లేదా ట్రైలర్ వచ్చినప్పుడో ఈ పని చేసి ఉంటే  తగినంత సమయం ఉండేది కాబట్టి పాజిటివ్ గా ఆశించవచ్చు. ఇప్పుడు కష్టమేనని చెప్పాలి.

ఇదంతా నిర్మాత కం నరేష్ ఊహించలేక కాదు. అందుకే ముందు నుంచి ఇది తన నిజ జీవిత కథని చెప్పకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ వచ్చారు. మీడియా నొక్కి అడిగినా సరే ఇది కల్పితం అన్నట్టుగానే దర్శకుడు ఎంఎం రాజు అన్నారు కానీ జరిగిందే చూపిస్తున్నామని చెప్పలేదు. అయితే ట్రైలర్ చూసిన ఎవరికైనా అది దేని గురించో చాలా సులభంగా గుర్తించేలా క్లూస్ ఇచ్చారు. పైగా కృష్ణ గారితో సహా అందరి ప్రస్తావన అందులో ఉంది. కాకపోతే మారుపేర్లు ఉంటాయి అంతే. గత రెండు వారాలుగా నరేష్ పవిత్ర లోకేష్ దీని కోసం  నాన్ స్టాప్ గా విస్తృత ప్రమోషన్లు చేశారు

ఇంత చేసినా బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. నేరుగా థియేటర్ కు వచ్చి చూసేవాళ్ల మీద  దీని భవితవ్యం ఆధారపడి ఉంది. నరేష్ పవిత్రల బంధం గురించి ఆన్ లైన్ లో ఎంత ఆసక్తి చూపించినా అదే రిలేషన్ కి టికెట్లు కొని మరీ చూసేంత స్థాయిలో హైప్ లేదన్నది వాస్తవం. ఇది గుర్తించే నరేష్ వీలైనంత బజ్ తెచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవిత్రని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. తన లవ్ స్టోరీని పదే పదే చెప్పుకున్నారు. మరి ఈ కేసు ఏమైనా ఝలక్ ఇస్తుందో ఏమైనా సాఫీగా విడుదలకు మార్గం సుగమం చేస్తుందో చూడాలి