గేమ్ మార్చేసిన దిల్ రాజు

రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ విడుదల డిసెంబర్ లేదా జనవరిలో ఉంటుందని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. జరుగుతున్న పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి. కమల్ హాసన్ ఇండియన్ 2 పొంగల్ ని ఫిక్స్ చేసుకుందని చెన్నై టాక్. తెలుగు డబ్బింగ్ నైజామ్ హక్కులను దిల్ రాజే తీసుకున్నారట. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇండియన్ 2 షూటింగ్ వేగవంతం చేసి ఇంకో రెండు మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసేలా శంకర్ వేగం పెంచారు. దీనివల్లే రామ్ చరణ్ కు ఎక్కువ సెలవులు దొరికేశాయి.

ఇంతే కాదు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో రాబోయే ఎస్ఎస్ఎంబి 28 రైట్స్ కూడా రాజుగారికే వచ్చాయట. ఈ లెక్కన ఏ కోణంలో చూసినా గేమ్ చేంజర్ వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. పైగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె రేస్ లో ఉంది. ఇప్పటికే త్రిముఖ పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మధ్యలో ఇంకో ప్యాన్ ఇండియా మూవీ రావడం అంత సేఫ్ కాదు. పైగా థియేటర్ల సమస్య వస్తుంది. అందుకే వేసవిలో టార్గెట్ చేసుకుని పుష్ప 2 ది రూల్, దేవర డేట్లను చూసుకుని కాంపిటీషన్ వల్ల గేమ్ చేంజర్ కు రిస్క్ రాకుండా దిల్ రాజు ప్లానింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

ఈ లెక్కన చిత్రీకరణ ఎప్పుడు పూర్తయినా చరణ్ అభిమానులు ఇంకో ఏడాది పైనే ఎదురు చూడక తప్పదు. ఇంకా పాతిక భాగం టాకీ పార్ట్, రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయట. హడావిడి పడి అటుఇటు చేసుకోవడం కన్నా నిదానమే ప్రధానం సూత్రం పాటించడమే మంచిది. ఇదయ్యాకే చరణ్ బుచ్చిబాబు సెట్లోకి ఎంటర్ కాగలడు. ఇంత ఆలస్యం ఉన్నందు వల్లే గేమ్ చేంజర్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇప్పట్లో ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి తమన్ సంగీతం మీద ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.