ఎన్టీఆర్ కోసం టాలీవుడ్ అరుదైన కలయిక

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను రేపు హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కైతలపూర్ మైదానంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రజనీకాంత్ ముఖ్యఅతిథిగా  ఈ వేడుకను చేయడం తెలిసిందే. ఇప్పుడు దాన్ని తలదాన్నీ స్థాయిలో భాగ్యనగరాన్ని వేదికగా మార్చబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి రాబోయే గెస్టులతో అరుదైన కలయిక జరిగే అవకాశం ఉందని సిటీలో ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన స్వాగతం బోర్డులను చూస్తే అర్థమవుతోంది.

పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, ప్రభాస్, కళ్యాణ్ రామ్ తదితరులకు వెల్కమ్ చెబుతూ ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేశారు. వీళ్లందరితో బాలకృష్ణకు అన్ స్టాపబుల్ షో రూపంలో మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే ఆయనే స్వయంగా వాళ్ళను ఆహ్వానించినట్టు దానికి అంగీకారం వచ్చినట్టు తెలిసింది. చివరి నిమిషంలో ఒకరిద్దరు డ్రాప్ అయినా మొత్తానికి కనులవిందుగా అనిపించే తారాతోరణం సందడి చేయబోతోంది. చిరంజీవికీ ఆహ్వానం ఉన్నప్పటికీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం

వీళ్ళు కాకుండా ఎన్టీఆర్ తో పని చేసిన దర్శకులు నిర్మాతలు ఎందరో రాబోతున్నారు. రాజకీయ నాయకులు సరేసరి. ఎన్టీఆర్ కు చిరకాలం నిలిచిపోయే విధంగా గొప్ప నివాళిని ఈ సందర్భంగా అందించబోతున్నారు. నందమూరి నారా కుటుంబాల నుంచి దాదాపు అందరూ హాజరు కాబోతున్నారు. టాలీవుడ్ చరిత్రలో తనకు మాత్రమే సాధ్యమయ్యే సువర్ణాక్షర సంతకాన్ని లిఖించిన ఎన్టీఆర్ ను ఈ రీతిలో స్మరించుకోవడం అబినందించాల్సిన విషయం. ప్రత్యక్షంగా వచ్చే అభిమానులతో పాటు కోట్లాది ప్రేక్షకులు టీవీ ద్వారా ఈ ఉత్సవాలను చూడబోతున్నారు.