పవన్ నిర్మాతలు అస్సలు తగ్గట్లేదు

పవర్ స్టార్ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయకపోయినా కేవలం ఆ బ్రాండ్ తోనే కంటెంట్ తో సంబంధం లేకుండా కోట్ల ఓపెనింగ్స్ ధారాళంగా వస్తాయి. అలా అని పబ్లిసిటీని నిర్మాతలు లైట్ తీసుకోరు. ఎన్నడూ లేనిది ఒకేసారి నాలుగు సినిమాలను సెట్లపై ఉంచి ఊపిరి సలపంత బిజీగా ఉన్న పవన్ ఇవాళ్టి నుంచి ఓజి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి చిన్న షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు.

హరిహర వీరమల్లు బాలన్స్ ని వచ్చే నెల నుంచి ప్లాన్ చేయబోతున్నారు. ఇవాళ టైటిల్ రివీల్ చేయబోతున్న వినోదయ సితం రీమేక్ కి డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది ఒక్క చివరి దానికి తప్ప దేనికీ రిలీజ్ డేట్లు ఫిక్స్ కాలేదు. కానీ ఇటు పక్క డివివి దానయ్య అటు వైపు మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరూ ఇద్దరే రేంజ్ లో ట్విట్టర్ ని వేదికగా చేసుకుని షూటింగ్ స్పాట్ నుంచే ఎడతెగని అప్డేట్స్ ఇస్తున్నారు.

ఓజి ఫోటోలు ఇలా వదలడం ఆలస్యం అలా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ కు సంబంధించి తీసిన కొన్ని సీన్లతో టీజర్ కట్ చేసి సంచలనం సృష్టిస్తే తాజాగా బ్రో(ఇదే టైటిల్ కన్ఫర్మ్ కావొచ్చు) కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రంగంలోకి దిగి ఇవాళ సాయంత్రం 4కి వదలబోయే ఫస్ట్ లుక్ గురించి భారీ హైప్ ఇస్తోంది. గతంలో ఇంత యాక్టివ్ గా ఏ పవన్ నిర్మాతలు లేరన్నది వాస్తవం.

అంతెందుకు త్రివిక్రమ్ ఆధ్వర్యంలో నడిచే హారికా హాసిని సంస్థ సైతం అజ్ఞాతవాసి టైంలో రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండలేక నానా మాటలు పడింది. భీమ్లా నాయక్ సమయంలో సితార నాగవంశీ చొరవ తీసుకోవడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం డివివి, మైత్రి, పీపుల్స్ మీడియా ముగ్గురు నువ్వా నేనా అనే రేంజ్ లో ఇలా ప్రమోషన్లు చేసుకోవడం అనూహ్యం. బాలన్స్ ఉన్న ఏఎం రత్నం ఒక్కరే రంగంలోకి దిగితే పవన్ ఫ్యాన్స్ కి ఆన్ లైన్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఖాయమే.