ప్రభాస్ క్రేజ్ తగ్గలా..

ఒక సినిమాతో ఒక హీరో ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పది రెట్లు.. అంతకంటే ఎక్కువ పెరిగిపోవడం అన్నది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక్క ప్రభాస్ విషయంలో మాత్రమే జరిగిందని చెప్పాలి. ‘మిర్చి’ తర్వాత ‘బాహుబలి’ సినిమాతో అతను అమాంతం ఎలా ఎదిగిపోయాడో అందరూ చూశారు.

అదంతా రాజమౌళి ఘనతే అని చాలామంది అంటారు కానీ.. అందులో ప్రభాస్ కష్టాన్ని, అతడి ప్రతిభను కూడా తక్కువ చేయలేం. ఐతే సాహో, రాధేశ్యామ్ లాంటి తన స్థాయికి తగని చిత్రాలు చేయడం ద్వారా ప్రభాస్ ఈ ఫాలోయింగ్, మార్కెట్‌ను దెబ్బ తీసుకున్నట్లుగా కనిపించింది. దీంతో ప్రభాస్ పనైపోయిందని.. అతను పూర్వపు స్థితికి వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేసిన వాళ్లూ ఉన్నారు. కానీ సరైన సినిమా పడాలే కానీ.. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మళ్లీ చూస్తామని ధీమాగా చెబుతుంటారు అభిమానులు.

బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ సినిమాలకు సోషల్ మీడియాలో క్రేజ్ అయితే మామూలుగా ఉండట్లేదు. అతను అలవోకగా సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. పాత రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. ఇండియాలో మరే స్టార్‌కూ సాధ్యం కాని విధంగా ప్రభాస్ వరుసగా నాలుగు చిత్రాల ట్రైలర్లతో 100 మిలియన్ వ్యూస్ మార్కును అందుకోవడం విశేషం.

ఇటీవలే ‘ఆదిపురుష్’ ట్రైలర్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇది అంతలోనే 100 మిలియన్ వ్యూస్ క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. టీజర్ రిలీజైనపుడు చాలా నెగెటివిటీ కనిపించింది కానీ.. ట్రైలర్ మాత్రం మెజారిటీ జనాలను మెప్పించింది. ఇంతకుముందున్న నెగెటివిటీని ట్రైలర్ చెరిపేసింది.

సినిమాకు ప్రస్తుతం పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఇండియాలో మరే హీరో సినిమాల ట్రైలర్లు కూడా వరుసగా నాలుగు వంద మిలియన్ల మార్కును అందుకున్న చరిత్ర లేదు. దీన్ని బట్టే ప్రభాస్ క్రేజ్ ఏమీ తగ్గలేదని.. సినిమా బాగుంటే అతను మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అర్థమవుతోంది.