ఒక్క ఫైట్ కోసం జస్ట్ 35 కోట్లు

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన యష్ రాజ్ ఫిలింస్ కి పఠాన్ రూపంలో దక్కిన బ్లాక్ బస్టర్ మాములు కిక్ ఇవ్వలేదు. స్లంప్ లో ఉన్న ఉత్తరాది పరిశ్రమకు ఒక్కసారిగా వెయ్యి కోట్ల సినిమా పడటంతో ఉత్సాహం వచ్చేసింది. దాని తర్వాత ఆ స్థాయిలో ఆడిన మూవీ రాకపోయినా మెల్లగా కుదురుకుంటున్న మాట వాస్తవం. పఠాన్ సక్సెస్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ పావు గంట క్యామియో ఎంత కీలక పాత్ర పోషించిందో వేరే చెప్పనక్కర్లేదు. టైగర్ గా భాయ్ జాన్ ఎంట్రీకి థియేటర్లు ఊగిపోయాయి. అందుకే టైగర్ 3 కోసం దీనికి మించిన ఎపిసోడ్ ప్లాన్ చేశారు.

మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో కత్రినా కైఫ్ హీరోయిన్ కాగా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. షారుఖ్ క్యారెక్టర్ ని పఠాన్ లో చూపించిన దానికన్నా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. కనిపించేది కాసేపే అయినా కేవలం ఆ ఒక్క బ్లాక్ కోసమే అక్షరాలా 35 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మే 8 నుంచి ఈ కాంబో షూట్ జరపబోతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ తో పాటు గ్రీన్ మ్యాట్ లో ఈ చిత్రీకరణ ఉంటుంది. ఏ సందర్భంలో సల్మాన్, షారుఖ్ లు ఇద్దరూ కలుస్తారనేది ఊహకందని విధంగా ఉంటుందన్నది యూనిట్ నుంచి వస్తున్న ఇన్ సైడ్ టాక్

స్పై సినిమాల మీద ఆదిత్య చోప్రా వందల కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడుతున్నారు. టైగర్ vs పఠాన్ కు ఆల్రెడీ మూడు వందల కోట్ల బడ్జెట్ రెడీ అయ్యింది. దీపికా పదుకునే కత్రినా కైఫ్ కలయికలో హీరోల ప్రమేయం లేకుండా లేడీ స్పై మూవీ తీసేందుకు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మొత్తంగా చూస్తే నార్త్ ఆడియన్స్ మాకీ గూఢచారి సినిమాలు వద్దు బాబోయ్ అనేదాకా యష్ రాజ్ బ్యానర్ ఆగేలా లేదు. అయినా ఒకటో రెండో అయితే పర్వాలేదు కానీ సంవత్సరాల తరబడి వీటినే తీసుకుంటూ పోతే కొత్త జానర్లు చూసే ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది