దూరంగా ఉన్నా దొరికిపోయిన దర్శకుడు

మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ అవకాశం ఇచ్చినప్పుడు దర్శకుడు పరశురామ్ జాతకం మారిపోయిందనే అనుకున్నారందరూ. కానీ సర్కారు వారి పాట కమర్షియల్ గా బాగానే పే చేసినా సూపర్ స్టార్ రేంజ్ అనిపించుకోవడం కానీ, తన బెస్ట్ గా నిలిచిపోవడం కానీ జరగలేదు. పైగా కంటెంట్ పరంగా చాలా విమర్శలే వచ్చాయి. సరే డిజాస్టర్ పడలేదనే సంతోషం అభిమానులకు మిగిలింది. అప్పటి నుంచి పరశురామ్ బయట కనిపించలేదు. మీడియాకు దొరకలేదు. ఎక్కడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మిత్రుల వేడుకల్లో కనిపిస్తాడేమోనని చూస్తే పెద్దగా ప్రయోజనం లేదు. 

ఆ మధ్య దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండతో ఓ సినిమాని ప్రకటించే దాకా తన పేరు మళ్ళీ వినిపించలేదు. అది కూడా వివాదం జరిగింది. తనకు మాట ఇచ్చి తప్పాడనే కోపంతో అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా నిలదీద్దామని  సమాచారం ఇచ్చి దాన్ని ఆపేసిన సంగతి అందరికీ గుర్తే. లోలోపల సర్దిచెప్పడంతో గీతా ఆర్ట్స్ అధినేత చల్లబడ్డారు. అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుని హఠాత్తుగా ప్రాజెక్టులు మారిపోతాడని పరశురామ్ మీదున్న అభియోగం. తానుగా దీని మీద బయట పడలేదు కానీ తాజాగా నాగ చైతన్య పలు ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

అసలు పరశురామ్ గురించి మాట్లాడ్డమే వృథా అన్నట్టు చైతు అన్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక పేరున్న దర్శకుడు ఇలా బహిరంగ విమర్శకు గురవ్వడం ఈ మధ్యకాలంలో లేదు. దీంతో అటు మహేష్ ఇటు చైతు ఫ్యాన్స్ ఇద్దరూ మీమ్స్, ట్వీట్లు, కొటేషన్లతో అతన్ని కార్నర్ చేయడం మొదలుపెట్టారు. సమాధానం చెప్పేందుకు అందుబాటులో లేకపోయినా ఎప్పుడూ సాఫ్ట్ గా ఉండే చైతు ఇంత అసహనంగా అన్నాడంటే కథ అంటూ స్క్రిప్ట్ అంటూ ఎంత టైం వృథా చేశాడో అర్థమవుతుందని విరుచుకుపడుతున్నారు. దూరంగా ఉన్న దొరికిపోవడమంటే ఇదే