‘ఎన్టీఆర్ 100’ సంబరాల్లో ఎన్టీఆర్ ఎక్కడ?


సినీ రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి.. కోట్లాది మంది గుండెల్లో కొలువైపోయిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఏడాది నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న ప్రతి చోటా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ తమ వంతుగా భారీ ఎత్తునే కార్యక్రమాలు చేపడుతోంది.

ఇందులో భాగంగా 28న విజయవాడలో ఒక విశిష్ట కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరు కాబోతున్నారు.

తెలుగులో ప్రధానమైన సినిమా వేడుకలన్నింటికీ వ్యాఖ్యాతగా వ్యవహరించే సుమ ఈ కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేయబోతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం అయింది. ఎన్టీఆర్ లెగసీని మూడో తరంలో ముందుకు తీసుకెళ్తున్న నటుడు తారకే. అతడి పాపులారిటీ, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాత మీద జూనియర్‌కు ఉన్న అభిమానం కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి వేడుకలో తారక్ కూడా ఉండాలని నందమూరి అభిమానుల్లో మెజారిటీ కోరుకుంటారు. కానీ అతడికి ఈ వేడుకకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.

తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సైతం ఆహ్వానం అందుకోలేదని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌ను పిలిస్తే తారక్‌ను పిలవలేదనే మాట వస్తుందని ఇద్దరినీ ఆహ్వానించలేదని తెలుస్తోంది. మరి మిగతా నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఈ వేడుకలో ఎంతమంది పాల్గొంటారో చూడాలి. దాన్ని బట్టి తారక్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా లేదా అనే విషయం తేలిపోతుంది.