రచ్చ దర్శకుడితో విరుపాక్షుడు

చాలా గ్యాప్ తర్వాత విరూపాక్ష రూపంలో బలమైన కంబ్యాక్ అనుకున్న సాయి ధరమ్ తేజ్ ఆనందం మాములుగా లేదు. ఓ మోస్తరు హిట్ అయినా చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ ఫలితం దక్కడం పట్ల యూనిట్ మొత్తం గాల్లో తేలుతోంది. పైగా మే 5న హిందీ వెర్షన్ ని విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను ప్యాన్ ఇండియా లెవెల్ లో చేయాలని డిసైడయ్యారు. శుక్రవారం ఏజెంట్, పీఎస్ 2 వచ్చాక వాటి రిపోర్టులను బట్టి ప్లానింగ్ లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇదిలా ఉండగా తేజు నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే ఉంది.

సంపత్ నందితో సాయిధరమ్ తేజ్ ప్రాజెక్టు లాకయ్యే దిశగా వెళ్తోంది. నిన్న అభిమానులతో ట్విట్టర్ వేదికగా జరిపిన చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని మాస్ సినిమా చేయొచ్చుగా అని అడిగాడు. దానికి తేజు సమాధానమిస్తూ ఏంటి సంపత్ నంది సిద్ధమేనా అంటూ ట్యాగ్ చేయడం అతనూ వెంటనే లైన్ లోకి వచ్చి ఔనన్నట్టు సంకేతం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అఫీషియల్ గా ఇంకా ప్రకటించనప్పటికీ మొత్తానికి ఇద్దరూ ఓకే అనుకున్న మాట వాస్తవమేనని అర్థమవుతోంది. విరూపాక్ష 2 ఉంటుందని ఇటీవలే హింట్ ఇచ్చిన తేజు ముందు ఏది చేస్తాడో చూడాలి

అయితే సంపత్ నంది చాలా ఏళ్లుగా ఫామ్ లో లేడు. రచ్చ సక్సెస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం చూడలేదు. బెంగాల్ టైగర్, గౌతమ్ నందా, సీటిమార్ ఏవీ యునానిమస్ గా హిట్ అనిపించుకోలేదు. మధ్యలో కథకుడిగా నిర్మాతగా పలు సినిమాలు చేశాడు కానీ డైరెక్టర్ గా మాత్రం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. మరి సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి కథ రాసుకున్నాడో చూడాలి. విరూపాక్ష తర్వాత తేజు నుంచి ఆడియన్స్ ఏంతో కొంత ప్రత్యేకంగా ఆశిస్తారు. అలాంటప్పుడు మళ్ళీ రొటీన్ బాట ఎక్కకపోతే చాలు. అప్పట్లో ఇంటెలిజెన్స్ పొరపాటు రిపీట్ అవ్వకపోతే అదే పదివేలు