‘ఇస్మార్ట్’ జోడీ.. ‘ఇస్మార్ట్’ డేట్‌కే..

‘లైగర్’ సినిమా చూసి అందరూ పూరి జగన్నాథ్ మీద నమ్మకం కోల్పోయారు. ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ జనాలు పూరిని ఎంతమాత్రం నమ్మే పరిస్థితి లేదు. చివరికి ‘లైగర్’లో నటించిన విజయ్ దేవరకొండ సైతం ‘జనగణమన’ చేయలేక తప్పుకున్నాడు. అతను ఓకే అన్నా ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లడం కష్టమే అని పూరి కూడా డ్రాప్ అయిపోయాడు. పూరిని నమ్మి ఈ పరిస్థితుల్లో ఏ స్టార్ హీరో కూడా డేట్లు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

దీంతో ఆరు నెలలకు పైగా ఖాళీగా ఉండిపోయాడు పూరి. ఆయన కెరీర్లో ఫ్లాపులు, డిజాస్టర్లు కొత్త కాదు కానీ.. ఇలా ఇంకో సినిమా ఛాన్స్ లేక ఖాళీగా ఉండటం మాత్రం ఎన్నడూ జరగలేదు. చివరికి పూరిని కష్టకాలంలో ఆదుకోవడానికి యంగ్ హీరో రామ్‌యే ముందుకు వచ్చాడు. ఇంతకుముందు పూరి స్లంప్‌లో ఉండగా.. వద్దు వద్దన్నా వినకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ చేశాడు. అది ఇద్దరికీ మంచి ఫలితాన్నే ఇచ్చింది.

ఇప్పుడు పూరి మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండగా.. రామ్ ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. వీరి కలయికలో సినిమాకు స్క్రిప్టు రెడీ అవుతోంది. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. ఇంతకుముందులా కాకుండా ఈసారి పూరి కొంచెం ఎక్కువ టైమే తీసుకుని స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం.

అక్టోబరు సమయానికి సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ అంతా పూర్తి చేసి జులై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. జులై 18 అంటే అందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’ గుర్తుకొస్తోంది. ఆ రోజే సినిమా రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. ఈ డేట్‌ను పూరి-రామ్ జోడీ సెంటిమెంటుగా భావిస్తోందన్నమాట.