రాజమౌళి బాటలో బన్సాలీ

ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా రాజమౌళిని అనుసరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఆయనంటే నచ్చని వాళ్లు, అసూయ చెందే వాళ్లు కూడా తనలా భారీ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో మేకింగ్, మార్కెటింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన శైలిని అనుసరిస్తున్నారు. బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ సైతం రాజమౌళి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయన తాజాగా హాలీవుడ్ ఏజెన్సీ డబ్ల్యూఎంఈతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సంస్థ నటీనటులు, టెక్నీషియన్లతో డీల్స్ చేస్తుంది. హాలీవుడ్లో బాగా ఫేమస్ అయిన ఈ సంస్థతో భాగస్వామ్యం అంటే భన్సాలీ తన తర్వాతి చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీయబోతున్నట్లే. రాజమౌళి ఆయన కంటే ముందు ఇలాగే సీఏఏ అనే హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నాడు. మహేష్ బాబుతో జక్కన్న తీయబోయే సినిమాకు ఈ సంస్థ సహకారం అందించనుంది.

‘ఆర్ఆర్ఆర్’తో భారతీయ సినిమా స్థాయి పెరిగిన నేపథ్యంలో మన దర్శకులతో సినిమాలు చేయడానికి హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక భన్సాలీ తర్వాతి సినిమా గురించి ఇంకా ఏ వివరాలూ వెల్లడి కాలేదు కానీ.. అది భారీ స్థాయిలోనే ఉండబోతోందని అర్థమవుతోంది. ఇందులో టాలీవుడ్ స్టార్లలో ఎవరో ఒకరు నటిస్తే ఆశ్చర్యమేమీ లేదు.

జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు మహేష్ బాబు, అల్లు అర్జున్‌లను భన్సాలీ వేర్వేరు సందర్భాల్లో కలిశాడు. ఎందుకు ఏంటి అన్న వివరాలు వెల్లడి కాలేదు కానీ.. వారి మధ్య సినిమా చర్చలు జరగకుండా ఉండి ఉండవు. కాబట్టి భన్సాలీ తర్వాతి చిత్రాల్లో వీరిలో ఎవరో ఒకరు ప్రత్యేక పాత్ర పోషించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇటీవలే తారక్ ‘వార్-2’లో ముఖ్య పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే.