మొదటి బంతి స్టేడియం దాటేసింది

నిన్న విడుదలైన విరూపాక్ష సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పబ్లిక్ టాక్ తో పాటు రివ్యూలు కంటెంట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో ఉదయం కొంత నెమ్మదిగా ఉన్న థియేటర్ల ఆక్యుపెన్సీలో సాయంత్రానికి అనూహ్యమైన మార్పులు వచ్చాయి. హైదరాబాద్ మార్నింగ్ షోలకు యాభై శాతం లోపే ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ స్టేటస్ సెకండ్ షో సమయానికి డెబ్భై దాటేయడం విశేషం. నైజామ్ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర 295 రూపాయలు పెట్టడం కొంత ప్రభావం చూపిస్తున్నప్పటికీ మొత్తంగా చూస్తే పికప్ చాలా బాగుంది.

ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ని బట్టి విరూపాక్ష మొదటి రోజు సుమారుగా 11 కోట్ల 70 లక్షల దాకా గ్రాస్ వసూలు చేసింది. షేర్ రూపంలో 6 కోట్ల ముప్పై లక్షల దాకా తేలుతుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 4 కోట్ల 70 లక్షలకు పైగా షేర్ దక్కడం చిన్న విషయం కాదు. సాయి ధరమ్ తేజ్ కి కెరీర్ బెస్ట్ పరంగా ఇది ఫస్ట్ ప్లేస్ కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో హారర్ మూవీకి ఇంత మొత్తాన్ని తక్కువ చేసి చూడలేం. ఇతర ప్రాంతాల్లో శనివారం నుంచి స్క్రీన్లు పెరుగుతున్నాయి. కిసీకా భాయ్ భాయ్ కిసీకా జాన్ కి డిజాస్టర్ టాక్ రావడంతో అది తేజుకి అనుకూలంగా మారింది.

అగ్రిమెంట్లలో భాగంగా కొనసాగుతున్న శాకుంతలం, విడుదల పార్ట్ 1, రుద్రుడులను  కొన్ని చోట్ల పబ్లిక్ డిమాండ్ మేరకు విరూపాక్షతో రీప్లేస్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ వారంలోనే సక్సెస్ టూర్ కి రెడీ అవుతున్నాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ ఇతర యూనిట్ సభ్యులతో కలిసి త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. వచ్చే ఫ్రైడే ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 వస్తున్న నేపథ్యంలో విరూపాక్షకు మొదటి ఏడు రోజుల వసూళ్లు కీలకం కానున్నాయి, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల వరకు ఉంది.