సల్మాన్ మాస్ కన్నా తేజు క్లాస్ నయం

రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రేక్షకుల దృష్టి ఉన్నది రెండింటి మీదే. ఒకటి విరూపాక్ష. రెండోది కిసీకా భాయ్ కిసీకా జాన్. విచిత్రంగా సాయి ధరమ్ తేజ్ వైపే ఆడియన్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి. ఉదాహరహణకు ఏదైనా మల్టీప్లెక్స్ చూస్తే షోలు సమానంగా పంచడం కనిపిస్తుంది కానీ కండల వీరుడి బొమ్మకు మాత్రం అన్ని స్క్రీన్లు గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి. తేజుకి అంతో ఇంతో మెల్లగా ఆరంజ్ నుంచి రెడ్ వైపు వెళ్తున్నాయి. రేపు ప్రీమియర్ పడే టైంకి ఈ ఆక్యుపెన్సీలో మంచి పెరుగుదల కనిపించడం ఖాయమే.

ముప్పై ఏళ్ళకు పైగా సుదీర్ఘమైన ట్రాక్ రికార్డుతో పాటు ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ఎన్నో చూసిన సల్మాన్ ఖాన్ కి ఈ పరిస్థితి ఆశ్చర్యం కలిగించేదే. అసలు ఫస్ట్ లుక్ పోస్టర్ తో మొదలుపెట్టి ట్రైలర్ దాకా భాయ్ జాన్ మీద విపరీతమైన ప్రీ నెగటివిటీ వచ్చింది. మాస్ పేరుతో ఇష్టం వచ్చిన పైత్యాన్ని జోడించడం వల్లే తమకు ఆసక్తి కలగడం లేదని మూవీ లవర్స్ సోషల్ మీడియాలో ఓపెన్ గా చెబుతున్నారు. పఠాన్ కు మొదటి రోజు 6 లక్షల మల్టీప్లెక్స్ టికెట్లు ముందస్తుగా అమ్ముడుపోతే కిసీకాకు 70 వేల టికెట్లు తెగడమే గగనంగా కనిపిస్తోంది. టాక్ వస్తే తప్ప గట్టెక్కే సూచనలు లేవు.

ఇక విరూపాక్షకు పాజిటివ్ వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి. హారర్ టచ్ ఉన్న విలేజ్ డ్రామానే అయినప్పటికీ సుకుమార్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు కార్తీక్ దండు మంచి ఇంటెన్స్ డ్రామాని రూపొందించారనే టాక్ అయితే ఉంది. లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఇందులో తేజుకి జోడి కట్టడం మరో సానుకూలాంశం. బ్యాక్ డ్రాప్ ఎంత వయొలెంట్ గా ఉన్నా సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్నది మాత్రం క్లాస్ పాత్రే. అజ్ఞానంలో ఉన్న పల్లెజనాలకు నిజాలు తెలియడం కోసం ప్రాణాలు రిస్క్ లో పెట్టే క్యారెక్టర్. మొత్తానికి ఈ ఫ్రైడే సల్మాన్ కన్నా తేజు ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటున్నాడు.