సినిమా పోయింది వేదాంతం వచ్చింది

ఎన్నో ఆశలు పెట్టుకుంటే పట్టుమని వారం తిరక్కుండానే డిజాస్టర్ ముద్ర వేయించుకున్న శాకుంతలం ఫలితం సమంతాకు పెద్ద షాకే ఇచ్చింది. ఒకవేళ హిట్ అయ్యుంటే ప్యాన్ ఇండియాలో మార్కెట్ పెరగడంతో పాటు అవకాశాలు క్యూ కడతాయన్న అంచనా పూర్తిగా తప్పింది. దీని ప్రభావం రాబోయే ఖుషి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే దాని హీరో విజయ్ దేవరకొండ లైగర్ అల్ట్రా ఫ్లాప్ తర్వాత వస్తున్నాడు. ఇప్పుడు తనకేమో గుణశేఖర్ దెబ్బ పడింది. దీంతో ఈ కాంబో మీద క్రేజ్ రావడం ఏమో కానీ కంటెంట్ బలంగా ఉంటే తప్ప ఆడియన్స్ లుక్ వేసేలా లేరు.

ఇదిలా ఉండగా సామ్ హఠాత్తుగా వేదాంతంలోకి దిగిపోయి తన ఇన్స్ టాలో భగవద్గీత శ్లోకాన్ని పెట్టింది. కర్మణ్యే వాదికా రస్తే మాఫలేషు కదాచన అంటూ నాలుగు లైన్లు షేర్ చేసింది. అంటే మనం కర్మ చేయడానికి మాత్రమే కానీ అధికారులం కాదు, ఏదో ప్రతిఫలం ఆశించి కర్మ చేయకూడదు, అలా అని వాటిని చేయడం మానకూడదని అర్థం. ఇది ఖచ్చితంగా శాకుంతలం ఫలితంని ఉద్దేశించినదని సులభంగా గుర్తు పట్టవచ్చు. జనం సినిమాని తిరస్కరించారని గుర్తించిన సామ్ రిలీజ్ మరుసటి రోజు నుంచే మౌనవ్రతం పట్టేసింది. ఇప్పుడింక అంతా అయిపోయిందని గుర్తించింది.

సరే ఇలాంటి ఫ్లాపులు అందరికీ సహజమే కానీ తన లుక్స్, డబ్బింగ్ మీద కూడా విమర్శలు రావడం సమంత ఊహించనిది. సినిమా పోయినా సామ్ బాగా చేసిందన్న టాక్ వచ్చి ఉంటే కనీసం ఆ సంతృప్తి అయినా మిగిలేది. అదీ జరగలేదు. అసలీ కథను చేయడమే పెద్ద తప్పటడుగని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సమంతా ఇవాళ లండన్ బయలుదేరినట్టు సమాచారం. షూటింగ్ కోసమో లేక వ్యక్తిగత విశ్రాంతి కోసమో ఇంకా తెలియాల్సి ఉంది. అన్నట్టు నెక్స్ట్ ఖుషిలో స్వంత గొంతు వినిపిస్తుందా లేక రిస్క్ వద్దనుకుంటుందా వేచి చూడాలి మరి.