నాగార్జున 99 వెనుక ఏం జరుగుతోంది

కింగ్ నాగార్జున రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీయబోతున్న సినిమా షూటింగ్ ఎంతకీ ప్రారంభం కాకపోవడం అభిమానుల అసహనానికి కారణమవుతోంది. మలయాళం హిట్ మూవీ పోరింజు మరియం జోస్ ఆధారంగా రూపొందబోయే ఈ విలేజ్ డ్రామా స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధమయ్యింది. అయితే హక్కుల విషయంలో నిర్మాతలిద్దరికీ వచ్చిన అభిప్రాయభేదాల వల్ల రెండు నెలలు బ్రేక్ పడింది. దీనికోసమే ప్రత్యేకంగా గెడ్డం పెంచి కొత్త లుక్ కి వచ్చిన నాగ్ అది తనకు పూర్తి సంతృప్తినివ్వకపోవడంతో మళ్ళీ క్లీన్ షేవ్ కు వచ్చేశారని ఇన్ సైడ్ టాక్.

ఇప్పుడింకో లుక్ మీద ప్రసన్న పనిచేస్తున్నట్టు సమాచారం. ఇది కాకుండా స్క్రిప్ట్ లో చేసిన మార్పులు కూడా మరోసారి చర్చలోకి వచ్చాయట. ఊరికే హడావిడి పడి 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న డెడ్ లైన్ తో ఇబ్బంది పడకుండా ఎంత ఆలస్యమైనా సరే పర్ఫెక్ట్ గా అన్నీ కుదిరాకే సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని వినికిడి. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు ఈ ప్రాజెక్టే క్యాన్సిల్ అయ్యిందని నాగార్జున మరో ఆప్షన్ చూస్తున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. మొత్తానికి ఈ టీమ్ లో ఉన్నవాళ్ళెవరూ డైరెక్ట్ గా మీడియాతో ఓపెనయ్యేందుకు ఇష్టపడటం లేదు.

గత కొన్నేళ్లుగా బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జున ఈసారి తొందరపాటు ప్రదర్శించే ఉద్దేశంలో లేరు. అవసరమైతే ఇదే కథకు దర్శకుడిని మార్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. అదే జరిగితే మొదటి అడుగులోనే ప్రసన్నకు పెద్ద దెబ్బ పడినట్టు అవుతుంది. ఇది 99వ మూవీ. వందో సినిమా గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో చేయాలని గతంలో డిసైడ్ అయ్యారు. కాకపోతే స్టోరీ విషయంలో దానికీ ఇబ్బంది ఉంది. మొత్తానికి ఈసారి ఫ్యాన్స్ కోరుకున్నంత వేగంగా నాగార్జున సినిమాలు రాకపోవచ్చు.