అప్పుడు ఆఫీస్ బాయ్‌.. ఇప్పుడు 400 కోట్ల సినిమా


కాంతార.. గత ఏడాది ఇండియాను ఊపేసిన సినిమా ఇది. దీనికంటే ముందు బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధించాయి కానీ.. అవన్నీ కూడా భారీ చిత్రాలు. కానీ ‘కాంతార’ కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం. దాని మీద పెద్దగా అంచనాలు లేవు. ముందు కన్నడ వరకే ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా పట్ల వేరే భాషల్లోనూ ఆసక్తి కనిపించడంతో దాన్ని చకచకా డబ్ చేసి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తే అన్ని చోట్లా భారీ వసూళ్లు దక్కించుకుంది. ఏకంగా రూ.400 కోట్లకు వెళ్లిపోయాయి ‘కాంతార’ వసూళ్లు.

ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దడమే కాక.. అందులోనూ గొప్ప నటనతోనూ ఆకట్టుకున్న రిషబ్ శెట్టి నేపథ్యం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అతను ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మామూలు కుర్రాడే.

సినిమాల్లోకి రావడానికి ముందు అతను ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేశాడట రిషబ్. ఈ విషయాన్ని స్వయంగా రిషబే వెల్లడించడం విశేషం. ముంబయి వేదికగా జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో పురస్కారం అందుకున్న సందర్భంగా రిషబ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు.

“ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. 15 ఏళ్ల కిందట నేను ముంబయికి వచ్చాను. వెస్ట్ అంధేరీలో ఒక నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్‌గా పని చేశాను. మళ్లీ ఇప్పుడు ఒక దర్శకుడు, నటుడిగా ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది” అని రిషబ్ తెలిపాడు. ‘కాంతార’ సినిమా అసాధారణ విజయం సాధించడంతో దానికి సీక్వెల్ తీసే ప్రయత్నంలో ఉన్నాడు రిషబ్. ఇప్పుడు ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సీక్వెల్ మీద ఉన్న అంచనాల్ని బట్టి చూస్తే సరిగ్గా తీస్తే అది వెయ్యి కోట్ల సినిమా కూడా అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదు.