అక్కర్లేని టాపిక్ ఎందుకు శృతీ

నిజ జీవితంలాగే మనకిష్టం లేని సంఘటనలు సినిమా పరిశ్రమలోనూ జరుగుతుంటాయి. కొన్నిసార్లు సర్దుకోవాలి ఓర్చుకోవాలి. అప్పుడే ఆర్టిస్టుల స్థితప్రజ్ఞత బయట పడుతుంది. వీలైనంత వరకు చేదు జ్ఞాపకాలు అనుకున్నవి తవ్వకుండా ఉండటం అవసరం. కానీ శృతి హాసన్ మాత్రం అబ్బే వదిలే సమస్యే లేదంటోంది. జనవరిలో విడుదలైన వాల్తేరు వీరయ్యలో రెండు పాటల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు చిరుతో కలిసి మంచులో డాన్సు చేయాల్సి రావడం చలిని భరించలేకపోవడం దాని వల్ల ఇబ్బంది పడటం గురించి ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వాపోతూ చెప్పడం అందరికీ గుర్తే.

సరే ఆరవై ఆరేళ్ళ చిరుకి లేని సమస్య తనకు ఎందుకొచ్చిందోనని కామెంట్స్ చేసిన అభిమానులు లేకపోలేదు. ఈ సమస్య మనవరకే పరిమితమయ్యింది. ఇటీవలే చెన్నైలో శృతి హాసన్ ఫ్యాన్ ఫెస్టివల్ అనే ప్రోగ్రాం చేశారు. దానికి వెళ్లిన అమ్మడు యాంకర్ తో మాట్లాడుతూ మళ్ళీ ఆ పాట గురించి ప్రస్తావన తెచ్చి నేను వద్దని బ్రతిమాలుకున్నా చీర కట్టించి చలిలో డాన్స్ చేయించారని క్యాసెట్ ని రిపీట్ చేసింది. దీంతో అక్కడికేదో మన దర్శక నిర్మాతలు బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు సందేశం వెళ్ళింది. ఈ వీడియో ట్విట్టర్ లో వచ్చి వైరల్ కావడం మొదలైంది.

దీంతో మెగా ఫాన్స్ రంగంలోకి దిగి శృతి హాసన్ ని నిలదీయడం మొదలుపెట్టారు. అయినా జరిగిపోయిన దాన్ని అదే పనిగా తవ్వడం ఎందుకని, ప్రీరిలీజ్ తో సహా వీరయ్య ప్రమోషన్లకు ఎందుకు రాలేదని వాళ్ళ ప్రశ్న. తెలుగులో అవకాశాలు తగ్గిపోయినప్పుడు ఒకే బ్యానర్ నుంచి ఇద్దరు పెద్ద హీరోల సరసన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య అవకాశాలు ఇచ్చిన మైత్రి, ప్రభాస్ జోడిగా ఆఫర్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ హోంబలే ఫిలిమ్స్ గురించి గొప్పగా చెబితే బాగుండేది తప్ప ఇలా ఏ హీరోయిన్ చలిలో డాన్స్ చేయలేదనే రేంజ్ లో చెప్పుకోవడం ఎందుకని లాజిక్ తీస్తున్నారు. ఏమైనా శృతి చేసింది అసందర్భపు ప్రస్తావనే.