సీనియర్స్ వెర్సస్ జూనియర్స్.. సల్మాన్ క్రేజీ కామెంట్స్

ప్రతి ఫిలిం ఇండస్ట్రీలోనూ ఒక తరంలో ఆధిపత్యం చలాయించిన హీరోలంతా ఒక దశ దాటాక సీనియర్లు అయిపోయి నెమ్మదిగా ఫాలోయింగ్ తగ్గడం.. యువతరం జోరు పెరగడం మామూలే. టాలీవుడ్లో కూడా అదే జరుగుతోంది. చిరు తరం హీరోలతో పోలిస్తే తర్వాతి తరం హీరోలదే ఇప్పుడు ఆధిపత్యం. బాలీవుడ్లో ఈ స్థాయిలో యువ హీరోలు హవా సాగించట్లేదు కానీ.. సీనియర్ల జోరు తగ్గుతున్న మాట మాత్రం వాస్తవం.

ఆమిర్ ఖాన్, అక్షయ్ లాంటి సీనియర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. షారుక్ కూడా కొన్నేళ్లు స్లంప్ చూశాడు కానీ ఈ ఏడాది ‘పఠాన్’తో పుంజుకున్నాడు. ఇప్పుడిక సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీకి జాన్’ సినిమాతో ఎలాంటి ఫలితం రాబడతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త తరం హీరోల జోరు గురించి స్పందించాడు. వాళ్లను పొగుడుతూనే కౌంటర్లు కూడా వేశాడు. ఇంతకీ సల్మాన్ ఏమన్నాడంటే..

“యంగ్ హీరోలు బాగానే కష్టపడుతున్నారు. వారికి సినిమా అంటే ప్యాషన్ ఉంది. వాళ్ల భవిష్యత్ ప్రణాళికలు కూడా బాగున్నాయి. కానీ మేమంతా (సల్మాన్, షారుఖ్, ఆమిర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్) సీనియర్లం అయిపోయామని వాళ్లు అనుకుంటున్నారు. కానీ మేం అన్ని రకాల సినిమాల్లో నటిస్తాం. ఏ సినిమానూ వదులుకోం. యంగ్ హీరోలు ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకూ పారితోషకాలు పెంచేస్తారు” అని సల్మాన్ వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యలు బీటౌన్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇక సల్మాన్ కొత్త చిత్రం విషయానికి వస్తే.. ఇది తమిళ ‘వీరం’ చిత్రానికి రీమేక్. తెలుగులో ఇదే సినిమా ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ అయి డిజాస్టర్ అయింది. హిందీ వెర్షన్‌కు బాగా మసాలాలు అద్దినట్లు కనిపిస్తున్నా రిజల్ట్ మీద సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్, రామ్ చరణ్ క్యామియోలు చేయడం విశేషం. పూజా హెగ్డే కథానాయికగా నటించింది.