చిన్న హీరో.. అంత నమ్మకం ఏంటో

టాలీవుడ్ లో దురదృష్టం బాగా వెంటాడుతున్న హీరోల వరసలో ముందున్నాడు సంతోష్ శోభన్. టాలెంట్, చక్కని రూపం, పెద్ద బ్యానర్ల అండ, ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరో మద్దతు ఇన్ని ఉన్నా విజయం మాత్రం అందని ద్రాక్షపండే అవుతోంది. చిరంజీవి కూతురు సుష్మిత నిర్మాతగా వ్యవహరించిన శ్రీదేవి శోభన్ బాబు కనీసం పబ్లిసిటీ ఖర్చులు వెనక్కు తేలేదు.

యువి తీసిన కళ్యాణం కమనీయం సంక్రాంతి పోటీలో నలిగి డిజాస్టర్ అయ్యింది. స్టార్లను డీల్ చేసిన మేర్లపాక గాంధీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ని కనీసం ఓటిటిలో పర్వాలేదన్నవాళ్ళు కనిపిస్తే ఒట్టు. మాములుగా ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంటే కెరీర్ త్వరగా క్లైమాక్స్ కు వచ్చేది. కానీ సంతోష్ శోభన్ సుడి బాగుంది. ప్రాజెక్టులు సెట్ అవుతూనే ఉన్నాయి.

స్వప్న సినిమా సంస్థ నుంచి రాబోతున్న అంతా మంచి శకునములే మీద ఏమంత బజ్ లేకపోయినా అశ్వినిదత్ ఫ్యామిలీ నిర్మాణం కావడంతో థియేట్రికల్ రిలీజ్ పరంగా ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. తాజాగా యువి సంస్థ పాతిక కోట్ల బడ్జెట్ తో మరో భారీ చిత్రాన్ని ఇతనితో ప్లాన్ చేస్తోందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. యుద్ధ నేపథ్యంలో శ్రీరామ్ రెడ్డి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారని టాక్.

ఇది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే ఒక ఫ్లాప్ హీరోతో డెబ్యూ డైరెక్టర్ ని పెట్టుకుని ఇంత మొత్తం షేర్ రూపంలో థియేటర్ల నుంచి రాబట్టాలంటే కంటెంట్ ఎక్స్ ట్రాడినరీగా ఉండాలి. యూవి ఇంత సాహసం చేస్తోందంటే మ్యాటర్ ఏదో బలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే సంతోష్ శోభన్ కు శకునములేతో పాటు దీని విజయం చాలా కీలకం. కెరీర్ గ్రాఫ్ లో కౌంట్ పెరుగుతోంది తప్ప బ్రేక్ పరంగా ఎలాంటి మలుపు చూడలేకపోతున్న ఈ కుర్రహీరోకు ఏదో అద్భుతం జరిగిపోవాలి. ఇన్ని బడా సంస్థలు అండగా ఏదో ఒకనాడు అది జరగక మానుతుందా..