కాంతారా హీరో పొలిటికల్ ఎంట్రీ నిజమేనా

ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చి సినిమాలు తీస్తున్నా రిషబ్ శెట్టి అనే పేరు మ్రోగిపోయింది మాత్రం కాంతారతోనే. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం పదహారు కోట్ల బడ్జెట్ తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల దాకా వసూలు చేయడం ఎప్పటికి మర్చిపోలేని సంచలనం. కర్ణాటకలో కెజిఎఫ్ ని మించిన థియేటర్ ఫుట్ ఫాల్స్ దీనికే వచ్చాయంటే నమ్మశక్యం కాదేమో అనిపిస్తుంది కానీ ఇది నిజం. అందుకే రిషబ్ శెట్టి ఫేమ్ బాలీవుడ్ దాకా వెళ్ళిపోయి అక్కడి సెలబ్రిటీలతో పాటు కూర్చుని నేషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొనే అవకాశం దక్కింది.

ఇదంతా బాగానే ఉంది కానీ రిషబ్ రాజకీయ ప్రవేశం గురించి కొన్నాళ్లుగా బెంగళూరు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదో పార్టీకి మద్దతుగా ఉన్నాడని అందుకే ఢిల్లీ వెళ్ళినప్పుడు పలువురిని కలిశాడని ఇలా ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఫ్యాన్స్ నిజమనే అనుకున్నారు. కానీ ఇతను మాత్రం అవన్నీ కొట్టి పారేస్తున్నాడు. ప్రస్తుతం తన ధ్యాస సినిమాల మీద తప్ప దేని మీద లేదని కుండబద్దలు కొట్టేస్తున్నాడు. ఒక జర్నలిస్ట్ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా టికెట్లు కొని మంచి చిత్రాలను ఆదరించడం తప్ప ఇంకేం కోరుకోవడం లేదని తేల్చేశాడు.

సో ప్రచారమంతా ఉత్తుత్తిదే. రిషబ్ ప్రస్తుతం కాంతారకు ప్రీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. అంటే అసలైన మొదటిభాగం కథ ఇప్పుడు చెప్పబోతున్నాడన్న మాట. ఇటీవలే లొకేషన్ల వేటతో పాటు స్క్రిప్ట్ తాలూకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. కెజిఎఫ్, బాహుబలి తరహాలోనే దీని మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. అంచనాలు మించేలా బడ్జెట్ కు సంబంధించి ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా హోంబాలే ఫిలింస్ ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తెలుగు తమిళ రంగాలకు సంబంధించిన పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగం కానున్నారు