తారక్ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు

రీ రిలీజుల ట్రెండ్ క్రమంగా వట్టిపోతోంది. పది సినిమాల్లో రెండు ఆడుతుంటే మిగిలినవి కనీసం అద్దె ఖర్చులు కూడా కిట్టుబాటు చేయడం లేదు. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషి, ఆరంజ్ లు తప్ప కమర్షియల్ గా వర్కౌట్ అయినవి వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. స్టార్ హీరోల ఫ్యాన్స్ ని ఎమోషనల్ గా టార్గెట్ చేయడం వల్ల వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్న డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ సోషల్ మీడియాలో అర్థం లేని చర్చకు దారి తీస్తోంది.

నిన్న ఆంధ్రావాలా కొన్ని థియేటర్లలో స్క్రీనింగ్ చేశారు. ఒకటి రెండు చోట్ల తప్ప ఇంకెక్కడా కనీస స్థాయిలో జనం లేరు. నిజానికి అభిమానులే ఇది విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్ కు ఫోన్ చేసి మరీ వేడుకున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి హిట్లు అయితే ఎంజాయ్ చేస్తామని ఇలా డిజాస్టర్లు తేవడం వల్ల యాంటీ ఫ్యాన్స్ కి టార్గెట్ అవుతామని వాపోయారు. కానీ బయ్యర్ వినలేదు.

మొండిగా ముందుకెళ్లాడు. త్వరలో సింహాద్రిని తారక్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నామని వచ్చిన ప్రకటన అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. రాజమౌళి జూనియర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చని సంబరపడ్డారు. మే 20న ఆది కూడా వస్తుందని నిన్న సాయంత్రం హఠాత్తుగా ప్రకటన రావడం మూవీ లవర్స్ ని షాక్ కి గురి చేసింది.

ఇదీ వెండితెర మీద అనుభూతి చెందాల్సిన మాస్ బొమ్మనే. అయితే సింహాద్రి, ఆదిలను ఒకేసారి విడుదల చేయడం వల్ల తమను ఇబ్బందులకు గురి చేయడం తప్ప ఇంకేం ఉండదని ఫీలవుతున్నారు. బర్త్ డే అన్నప్పుడు ఏదో ఒకటే చేయాలి. ముందు సింహాద్రి అనౌన్స్ మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి కట్టుబడితే బాగుండేది కానీ ఇలా సడన్ గా మరొకటి తేవడం వల్ల ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో విడిపోయి ఒకటే చూస్తారు. దీనివల్ల రికార్డులు మిస్ అవుతాయి. వాళ్ళ బాధ సబబే.