మోహన్ బాబును అలా ఒప్పించాడు

తెలుగు సినిమా గర్వించదగ్గ దిగ్గజ నటుల్లో మోహన్ బాబు ఒకరు. 550కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారాయన. ఐతే ఒక 30 ఏళ్లు విరామం లేకుండా సినిమాలు చేసిన ఆయన.. గత దశాబ్దంన్నర కాలంలో బాగా జోరు తగ్గించేశారు. ఎప్పుడో కానీ ఒక సినిమా చేయట్లేదు. సొంత బేనర్ దాటి బయట సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు.

ఇలాంటి సమయంలో ‘శాకుంతలం’ సినిమా కోసం దుర్వాస మహర్షి అవతారం ఎత్తారాయన. మహర్షి అవతారంలో మోహన్ బాబు లుక్, ఆయన నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఐతే ఈ పాత్రకు మోహన్ బాబును ఒప్పించడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చిందని దర్శకుడు గుణశేఖర్ తెలిపాడు. ఇంతకుముందు ‘రుద్రమదేవి’ సినిమాలో ఓ పాత్రకు మోహన్ బాబును అడిగి లేదనిపించుకున్న తాను.. ఈ సినిమాకు ఎలా ఒప్పించిందీ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు గుణ.

“గతంలో రుద్రమదేవిలో ఓ ముఖ్య పాత్రకు మోహన్ బాబు గారిని అడిగాను. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ రోజు ఆయన్ని నేను బలవంతం చేయలేదు. కానీ ‘శాకుంతలం’ సినిమా అనుకున్నాక.. నేరుగా వెళ్లి ఆయన్ని కలిశాను. ‘ఈసారి మీరు నో చెప్పలేని పాత్రతో వచ్చాను.. మీరు చేయనంటే ఆ పాత్రకు ప్రత్యామ్నాయం ఎవరో కూడా మీరే చెప్పాలి” అన్నాను.

దానికి ఆయన పాత్ర ఏంటో చెప్పమన్నారు. ‘శాకుంతలం’ సినిమాలో దుర్వాస మహర్షి పాత్ర అని చెప్పగా.. పెద్దగా నవ్వి, కోపిష్టి పాత్ర కాబట్టి నా దగ్గరికి వచ్చావా అన్నారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే కాదు.. గొప్ప లక్షణాలు చాలా ఉన్నాయి అని చెబితే ఆయన సరే అని ఆ క్యారెక్టర్ చేయడానికి ముందుకు వచ్చారు. దుర్వాస మహర్షి పాత్రకు మోహన్ బాబు గారు నా ఛాయిస్ కాదు. అభిజ్ఞాన శాకుంతలం రాసిన కాళిదాసే మోహన్ బాబు గారిని ఎంచుకున్నారని అనుకుంటా. ఆయనే ఈ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలరని అనిపించింది’’ అని గుణ తెలిపాడు. శాకుంతలం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.