సమంత.. దిల్ రాజు కూతురు!

సమంతేంటి.. దిల్ రాజు కూతురేంటి అని సందేహం కలుగుతోందా? ఏదైనా సినిమాలో సమంతకు తండ్రిగా దిల్ రాజు నటిస్తున్నాడనిపిస్తోందా? ఇక్కడ విషయం వేరులెండి. ముంబయి వాళ్లు సమంత.. దిల్ రాజుకు కూతురని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా ప్రెస్ మీట్లో చెప్పాడు. ఈ సినిమాకు దిల్ రాజు సహ నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

సినిమా కోసం ఆయన పరిమితికి మించి ఖర్చు పెట్టాడని.. ఆ ఖర్చు చూసి ముంబయి జనాలు సమంత రాజుకు కూతురేమో.. అందుకే ఇంత ఖర్చు పెట్టాడేమో అనుకుంటున్నారని.. ఇదే మాట తనతో అన్నారని గుణశేఖర్ తెలిపాడు. ‘శాకుంతలం’ సినిమా త్రీడీలో రిలీజవుతుండటానికి రాజే కారణమని గుణ వెల్లడించాడు. పట్టుబట్టి ఆయనే సినిమాను త్రీడీలో చేయించినట్లు తెలిపాడు.

ముందు త్రీడీలో తీసిన ఒక సన్నివేశం చూసి దిల్ రాజు మెస్మరైజ్ అయ్యాడట. ఆ తర్వాత మొత్తం త్రీడీలో తీద్దాం అనే ప్రపోజల్ రాజే పెట్టాడట. దీని వల్ల బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుందని అన్నా కూడా ఆయన పర్వాలేదని, క్వాలిటీనే ముఖ్యం అని భావించి బడ్జెట్ పెంచారని.. త్రీడీ వల్ల సినిమా ఆరు నెలలు ఆలస్యం అయిందని గుణశేఖర్ వెల్లడించాడు.

ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ రికార్డు ‘శాకుంతలం’దే అని.. ప్రేక్షకులకు ఈ సినిమాతో సరికొత్త అనుభూతిని అందిస్తామని గుణ ధీమా వ్యక్తం చేశాడు. సమంతకు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించిన ‘శాకుంతలం’ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఒకేసారి ఏప్రిల్ 14న విడుదల కానుంది. గుణ సొంత బేనర్లో ఈ సినిమా తెరకెక్కింది.