కాస్త ఆగి ఉంటే అద్భుతాలు జరిగేవి

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బలగం ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్ రిలీజ్ కు ముందే చేసుకున్న అగ్రిమెంట్ వల్ల మంచి రన్ ఉండగానే కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో డిజిటల్ రావడం పట్ల సినీ ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దిల్ రాజు లాంటి నిర్మాతే ఇలా చేస్తే ఎలా అన్న కామెంట్లు వినిపించాయి. అయితే ప్రైమ్ లో వచ్చాక బలగం రీచ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇంత ఎమోషనల్ ఉంటుందని అసలు ఊహించలేదని ఇంకో వారంలో ఫ్యామిలీతో కలిసి హాలుకు వెళ్దామనుకుంటున్న టైంలో టీవీలో చూశామని నెటిజెన్లంటున్నారు. పాతిక రోజులు పూర్తి చేసుకున్న బలగం ఇప్పటిదాకా 22 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంటే షేర్ 11 కోట్ల పైమాటే. జరిగిన బిజినెస్ కి పదింతలు లాభం తెచ్చిన చిన్న చిత్రంగా ఇది రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

స్మార్ట్ స్క్రీన్ లో వచ్చేసినా కూడా దర్శకుడు వేణు యెల్దండి ప్రమోషన్లు ఆపడం లేదు. సినిమా బాగా ఆడుతున్న తెలంగాణ సెంటర్లలో క్రమం తప్పకుండా తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ యూనిట్ తో ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నాడు. ఇంకో రెండు వారాలు ఆగి ఉంటే పెద్దగా పోటీ లేని కారణంగా నాని దసరా వచ్చే వరకు బలగందే ఆధిపత్యం అయ్యేది

ఏది ఏమైనా ఇకపై నిర్మాతలు తమ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఓటిటి నిడివి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. కనీసం నెల రోజుల గ్యాప్ లేకపోతే ఆడియన్స్ క్రమంగా చిన్న సినిమాలను ఇంట్లోనే చూద్దామనే ధోరణికి వచ్చేస్తారు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత చిన్నా పెద్ద లేకుండా అందరు ప్రొడ్యూసర్స్ మీద ఉంది. బలగం కన్నా గొప్ప ఉదాహరణ అక్కర్లేదు. రైటర్ పద్మభూషణ్ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం వల్లే డీసెంట్ రన్ తో పాటు ఆశించిన లాభాల కన్నా ఎక్కువే వచ్చాయి. బలగం మాత్రం తొందరపడినట్టే.