‘భర్త’ మహా ‘రాజు’లకు భలే వరం దొరికింది

ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా మూవీస్ కే ఎక్కువ పరిమితమైన టికెట్ రేట్ల పెంపు మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలకు వచ్చేస్తోంది. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తికి పది రోజుల పాటు హైక్స్ పెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది.

మల్టీప్లెక్సుల్లో ప్రతి టికెట్ మీద 75, సింగల్ స్క్రీన్ లో 50 రూపాయల మేరకు పెంచుకునేందుకు పర్మిషన్ వచ్చింది. జిఓ ప్రకారం పండగ అయిపోయాక కూడా ఈ వెసులుబాటుని వాడుకునేలా కాల వ్యవధి ఉంది. ఇలా చేయడం కొత్త కాదు. గత ఏడాది హిట్ 3, తండేల్, మ్యాడ్ స్క్వేర్ లాంటివి పెంపు తీసుకున్న విషయం తెలిసిందే.

దీనికి ప్రేక్షకులు ఎలా రెస్పాన్స్ అవుతారనేది ఫలితాలను బట్టి ఉంటుంది. కంటెంట్ బాగుంటే యాభై వందా ధర ఎక్కువైనా ఆడియన్స్ భరించే స్థితిలోనే ఉన్నారని గతంలో ఋజువయ్యింది. ఒకవేళ ఫ్లాప్ అయితే ఇది పెద్ద శాపంగా మారుతుంది.

రవితేజ, నవీన్ పోలిశెట్టి నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా మెప్పిస్తామనే నమ్మకంతో పెంపు అవకాశాన్ని వాడుకుంటున్నారు. వీళ్ళు కోరుకుంటున్నట్టు నిజంగా బాగుందనే మాట పబ్లిక్ నుంచి వస్తే అదే భలే వరంగా మారుతుంది. థియేటర్ బిజినెస్ కోణంలో తొందరగా బ్రేక్ ఈవెన్ చేరుకోవడంతో పాటు లాభాలలో పెద్ద నెంబర్లు కనిపిస్తాయి.

నాణేనికి రెండో వైపు అన్నట్టు వందల కోట్లతో తీసిన వాటికి, రీజనబుల్ బడ్జెట్ తో అయినవాటికి పెంపు ఇవ్వడం పట్ల సాధారణ ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇదేంటని ఎవరైనా వేరే నిర్మాతలను ప్రశ్నిస్తే బస్సు చార్జీలు, ఉల్లిపాయల ధరలు, ఫ్లైట్ టికెట్లు పెరిగినప్పుడు రాని చర్చ, డిమాండ్ కేవలం మా ఇండస్ట్రీకి మాత్రమే వస్తుందని కొత్త లాజిక్ తీస్తున్నారు.

ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కనపెడితే ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంటే. అది బాగుంటే ఎలాంటి డిబేట్లు ఉండవు. లేదంటేనే అసలు చిక్కు. ఎవరికి వారు ధీమాగా అయితే ఉన్నారు మరి.