తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, ప్రీమియర్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పాటు ఏ ఇబ్బందీ లేకుండా వీటికి అనుమతులు వచ్చేశాయి. కానీ ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో చోటు చేసుకున్న విషాదం వల్ల.. చాలా రోజుల పాటు బెనిఫిట్ షోలు ఆగిపోయాయి. అదనపు రేట్లూ ఇవ్వలేదు.
కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు మాత్రం ఈ ఆఫర్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత అఖండ-2 చిత్రానికి కూడా ఈ సౌలభ్యం దక్కింది. దీంతో పెద్ద సినిమాలకు రేట్లు, అదనపు షోలు నార్మల్ అయిపోయాయి. ఇప్పుడు సంక్రాంతికి రాజసాబ్, మనశంకర వరప్రసాద్ చిత్రాలకు పెంపు ఇచ్చారు. ఐతే ఇలా పెంచినపుడల్లా, కేసులు, విమర్శలు తప్పట్లేదు.
స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెంపును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కోర్టు కూడా ఇటీవల ప్రస్తావించింది.
ఆ తర్వాత కూడా చిరు సినిమాకు రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విలేకరులను కలిసిన కోమటిరెడ్డికి ఈ అంశం మీద ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆయన స్పందిస్తూ తను సినిమా పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానేసినట్లు చెప్పారు. రెట్ల పెంపు జీవోలతో తనకు సంబంధం లేదన్నారు.
“నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా. పుష్ప-2 సినిమా తర్వాత నా దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని చెప్పా. నన్ను ఎవ్వరూ కలవడం లేదు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలోనే మహిళ చనిపోతే ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డాను. బాబు ట్రీట్మెంట్ కు కూడా నేనే డబ్బులు ఇచ్చాను.. ఇప్పుడు సినిమాలకు పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదు.
నా దగ్గరికి రావద్దని చెబుతున్నపుడు.. జీవోల కోసం నన్ను ఎందుకు కలుస్తారు. వాటితో నాకు సంబంధం లేదు. ఆ మెమోలను ఎవరు ఇచ్చారో నాకు తెలియదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఒక మహిళా ఐపీఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టిన కోమటిరెడ్డి.. తన కొడుకు చనిపోయినపుడే సగం చచ్చనని.. ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టడం కన్నా.. విషం ఇచ్చి చంపేయాలంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates