బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు చేస్తారని కొందరు హేటర్లు కామెంట్ చేయడం చూశానని, కానీ కంటెంట్ బేస్డ్ ఎక్కువ చేసింది కూడా మాస్ మహారాజేనని, నా ఆటోగ్రాఫ్ – శంభో శివశంభో లాంటివి ప్రేక్షకులు హిట్ చేసి ఉంటే మరిన్ని విలక్షమైన చిత్రాలు చేసేవారని చెప్పుకొచ్చారు.

వినడానికి బాగానే ఉంది కానీ ఇక్కడ బాబీ మిస్సవుతున్న లాజిక్ ఒకటుంది. రవితేజ రెగ్యులర్ గా వెళ్తున్నారనే కంప్లయింట్ ఎవరికీ లేదు. అవే చేసినా పర్వాలేదు కానీ అలరించేలా, ఎంటర్ టైన్ చేసేలా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నారు. అది జరగకపోవడం వల్లే ఫ్లాపులు.

కమర్షియల్ హీరోలకు ఎప్పటికీ చెరిపేయలేని కొన్ని పరిధులు ఉంటాయి. చిరంజీవి అంతటి మెగాస్టార్ రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి గొప్ప క్లాసిక్స్ చేస్తే జనం తిరస్కరించారు. శ్రీమంతుడు తరహా పాయింట్ తో కె విశ్వనాథ్ డైరెక్షన్లో బాలకృష్ణ జనని జన్మభూమి అనే సినిమా చేశారని ఎంతమందికి తెలుసు.

నాగార్జున కూలిలో విలన్ గా నటిస్తే స్వంత ఫ్యాన్సే జీర్ణించుకోలేపోయారు. కాబట్టి మాస్ చిత్రాలు ఎన్నయినా చేయొచ్చు. అవి అంచనాలు అందుకుంటే చాలు. అంతెందుకు బాబీనే తీసిన వాల్తేరు వీరయ్యలో సందేశం, ఎక్స్ పరిమెంట్లు లేవు. చిరంజీవి, రవితేజ కాంబోలో వచ్చిన మసాలా బ్లాక్ బస్టర్ అది.

కాబట్టి ఫలానా సినిమా హిట్ చేయకపోవడం అనేది ముమ్మాటికి ఆడియన్స్ తప్పు కానే కాదు. తాము కోరుకున్నవి ఇవ్వలేనప్పుడు మొహమాటం లేకుండా రిజక్ట్ చేస్తారు. హరిహర వీరమల్లుని డిజాస్టర్ చేసిన జనాలే ఓజికి మూడు వందల కోట్లు పువ్వుల్లో పెట్టి ఇచ్చారు. భోళా  శంకర్ ని తిట్టుకున్న ఫ్యాన్సే ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారుకి ఘనస్వాగతం చెబుతున్నారు.

రవితేజకైనా అంతే. ధమాకాకి అంత పెద్ద విజయం అందించిన విషయం మర్చిపోతే ఎలా. సో సరైన సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ బ్యాటింగ్ మాములుగా ఉండదు. ఈసారి భర్త మహాశయులకు విజ్ఞప్తితో అది నెరవేరుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.