వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి 14 రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధికారికంగా ప్రకటించింది. అయితే టైం లేని కారణంగా తెలుగు వెర్షన్ ఈ వారం మోక్షం దక్కించుకునే అవకాశం లేనట్టే.
వివరాల్లోకి వెళ్తే వా వతియర్ నిర్మాత జ్ఞానవేళ రాజా తనకు 21 కోట్ల 78 లక్షలు బాకీ చెల్లించాలని అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యాపారవేత్త వేసిన కేసు ఆధారంగా ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఆయన 2011లో భాగస్వామ్యం మీద 12 కోట్ల 85 లక్షలు స్టూడియో గ్రీన్ లో పెట్టుబడి పెట్టారు.
తర్వాత నిర్మాణం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత సుందర్ దాస్ ఇన్వెస్ట్ చేసిన మొత్తం వెనక్కు రాలేదు. దీంతో ఆయన కేసు వేశారు. ఈ న్యాయ పోరాటం 2013 నుంచే జరుగుతుండగా 2019లో కోర్టు ఈ అప్లికేషన్ ను స్వీకరించింది. ఎంతకీ బకాయిలు వసూలు కాకపోవడంతో సుందర్ దాస్ బృందం పిటీషన్లు వేస్తూనే వచ్చింది.
ఈ కారణంగానే డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన వా వతియార్ కు కోర్టు బ్రేక్ వేసింది. వడ్డీతో సహా బాకీ మొత్తం చెల్లించే దాకా థియేటర్, ఓటిటి, డిజిటల్ ఎందులోనూ విడుదల చేయడానికి వీళ్ళెందంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ పొంగల్ బాక్స్ ఆఫీస్ పరాశక్తి తప్ప వేరే సినిమా లేక డ్రైగా ఉండడంతో.. నిర్మాతలు ఏమైనా పరస్పర ఒప్పందం చేసుకొని ఉండొచ్చు అని సినీ వర్గాల సమాచారం.
జన నాయకుడు పొంగల్ రేస్ నుంచి తప్పుకున్నాక బంగారం లాంటి సీజన్ మిస్సవుతోందని భావించిన అన్నగారు వస్తారు నిర్మాత ఫైనల్ గా ఈ రూపంలో పరిష్కరించుకోవడం మంచి విషయమే. ఈ లావాదేవీకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సిఉంది.
ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ కాప్ డ్రామాలో కార్తీ విభిన్నమైన క్యారెక్టర్ చేశాడు. మన దగ్గర ఆలస్యమైనా తమిళంలో కనక మంచి టాక్ తెచ్చుకుంటే వసూళ్లు రాబట్టుకోవచ్చు. పరాశక్తికి నెగటివ్ రెస్పాన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో వా వతియర్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో ఇంకో నాలుగు రోజుల్లో తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates