కాంట్రవర్శీలతో వసూళ్లు రావు-విశ్వక్సేన్

విశ్వక్సేన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే చాలామందికి కామెడీగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే తమ సినిమాలకు హైప్ తేవడం కోసం వివాదాస్పద కామెంట్లు చేయడం, కాంట్రవర్శీలు క్రియేట్ చేయడం ఒక ట్రెండుగా మారిన ఈ రోజుల్లో.. విశ్వక్ తీరు ఆ తరహాలోనే కనిపిస్తుంటుంది. స్టేజ్ మీద అతను మాట్లాడే మాటలు, ఇచ్చే స్టేట్మెంట్లు అతిగా ఉంటాయి.

ఇక ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రిలీజ్ ముంగిట రోడ్డు మీద చేసిన ఒక ప్రాంక్ వీడియో.. దాని మీద ఒక టీవీ ఛానెల్ స్టూడియోలో జరిగిన చర్చా కార్యక్రమంలో జరిగిన రభస ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆ టైంలో విశ్వక్ మీద విమర్శలు కూడా వచ్చాయి. కావాలని కాంట్రవర్శీలు క్రియేట్ చేసి పబ్లిసిటీ పొందాలని చూస్తాడన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఐతే ఇప్పుడు విశ్వక్ తన శైలికి పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నాడు.

‘‘కావాలని కాంట్రవర్శీలు క్రియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోకుండా సమాధానం ఇవ్వడం వల్లే వివాదాలు వస్తున్నాయి. ఎక్కడైనా ఒక్కడే ఉన్న చోట రాళ్లు వేస్తారు. పది మంది ఉన్న చోట వేయరు. నేను ఏం జరిగినా మనకెందుకులే అనుకోకుండా సమాధానం ఇస్తా కాబట్టే వివాదాలు రాజేస్తున్నారు. నేనైతే కాంట్రవర్శీలు క్రియేట్ చేయాలనుకోను. కాంట్రవర్శీ వల్లే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి మార్నింగ్ షోలన్నీ హౌస్ ఫుల్ కాలేదు. మార్నింగ్ షోలకు మంచి టాక్ వచ్చాక మ్యాట్నీలకు వసూళ్లు పెరిగాయి. తర్వాత ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు’’ అని విశ్వక్ తెలిపాడు.

తన కొత్త సినిమా ‘దాస్ కా ధమ్కీ’ విడుదల నేపథ్యంలో మీడియాను కలిసిన సందర్భంగా విశ్వక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విశ్వక్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది కానుకగా బుధవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.