మన డైరెక్టర్ని కట్టేసుకున్నారే..

బాలీవుడ్లో ఆధిప‌త్యం చ‌లాయించిన తెలుగు ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ‌. గ‌తంలో రాఘ‌వేంద్ర‌రావు, ముర‌ళీమోహ‌న‌రావు లాంటి ద‌ర్శ‌కులు హిందీలో సినిమాలు చేశారు కానీ.. అక్క‌డ జెండా అయితే పాత‌లేదు. ఒక్క రామ్ గోపాల్ వ‌ర్మ మాత్ర‌మే.. బాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అక్క‌డ భారీ విజ‌యాలు అందుకున్నాడు. ప‌దుల సంఖ్య‌లో సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశాడు. ఆయ‌న త‌ర్వాత ఇంకే టాలీవుడ్ ద‌ర్శ‌కుడూ బాలీవుడ్లో ఆధిప‌త్యం చ‌లాయించ‌లేదు.

ఐతే ఇప్పుడు అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్లో వ‌ర్మ త‌ర్వాత అంత ప్ర‌బావం చూపేలా క‌నిపిస్తున్నాడు. అర్జున్ రెడ్డితో తెలుగులో సెన్సేష‌న్ క్రియేట్ చేశాక‌.. అత‌ను బాలీవుడ్‌కు వెళ్లిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమానే క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఆ చిత్రాన్ని నిర్మించింది బాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన భూష‌ణ్ కుమార్.

క‌బీర్ సింగ్ హిందీలో ఇంకా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది. భూష‌ణ్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో సందీప్ రెడ్డి ప‌నితీరుకు బాగా ఇంప్రెస్ అయిపోయిన భూషణ్‌.. అత‌ణ్ని వ‌దిలిపెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌ట్లేదు. ఆల్రెడీ అత‌డితో ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా యానిమ‌ల్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు భూష‌ణ్‌. అంత‌టితో వీరి బంధం ముగియ‌ట్లేదు. దీని త‌ర్వాత ప్ర‌భాస్‌తో చేయ‌బోయే స్పిరిట్‌కూ భూషణే ప్రొడ్యూస‌ర్. ఇప్పుడేమో కొత్త‌గా అల్లు అర్జున్ సినిమా తెర‌పైకి వ‌చ్చింది. ఈ చిత్రాన్ని కూడా భూష‌ణే ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు. అంటే వ‌రుస‌గా సందీప్‌తో భూష‌ణ్ నాలుగో సినిమా తీయ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

చూస్తుంటే సందీప్ స‌మీప భ‌విష్య‌త్తులో టాలీవుడ్ వైపు చూసేలా లేడు. ఇక్క‌డి నిర్మాత‌ల‌కు సినిమాలు చేసేలా లేడు. రాబోయే మూడు సినిమాలు కూడా బాగా ఆడితే.. బాలీవుడ్లో వ‌ర్మ రేంజికి వెళ్లిపోతాడేమో సందీప్ రెడ్డి.