సీనియర్ డైరెక్టర్.. ఎందుకొచ్చిన ప్రయాస

ప్రతి దర్శకుడికీ ఒక ప్రైమ్ టైం అనేది ఉంటుంది. ఎంత గొప్ప దర్శకుడు అయినా ఆ ప్రైమ్ అయిపోయాక.. డౌన్ అయిపోతాడు. ఒక దశ దాటాక ట్రెండుకు తగ్గట్లు సినిమాలు తీయలేక ఎదురు దెబ్బలు తింటాడు. కొంతమంది తమ టైం అయిపోయిందని అర్థం చేసుకుని సినిమాలు మానేస్తారు. కొందరు మాత్రం మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, విశ్వనాథ్ లాంటి దిగ్దర్శకులు కూడా ఒక దశ దాటాక ప్రేక్షకులను రంజింపజేయలేకపోయారు. విశ్వనాథ్ చాలా ముందే పరిస్థితి అర్థం చేసుకుని సైలెంట్ అయిపోగా.. దాసరి, రాఘవేంద్రరావు మెగా ఫోన్ పెట్టడానికి చాలా టైం పట్టింది. వీళ్ల స్థాయి కాకపోయినా టాలీవుడ్లో తమదైన ముద్ర వేసిన గొప్ప దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. యమలీల, శుభలగ్నం, మావిచిగురు లాంటి మరపురాని చిత్రాలను అందించిన గొప్ప దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.

ఐతే ఆయన మెరుపులు 90వ దశకం వరకే. ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నారు. రీమేక్ మూవీ అయిన ‘పెళ్ళాం ఊరెళ్తే’ తప్పితే చివరి పదేళ్లలో చెప్పుకోదగ్గ హిట్ లేదు ఆయనకు. చివరగా ఆయన తీసిన ‘యమలీల-2’ కూడా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ దెబ్బతో తెలుగులో సినిమాలు తీయడం మానేశారు. తన దర్శకత్వంలో వచ్చిన ఒకప్పటి సినిమా ‘ఆహ్వానం’ను ఇంగ్లిష్‌లో ‘డైవర్స్ ఇన్విటేషన్’ పేరుతో తీసి చేతులు కాల్చుకున్న ఆయన.. చాలా ఏళ్ల నుంచి లైం లైట్లో లేరు. ఈ మధ్య ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రంలో ఆయన నటుడిగా కనిపించారు. ఇక మళ్లీ దర్శకత్వం లాంటి ఆశలేమీ పెట్టుకోరని అనుకున్న సమయంలో ఆయన ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమా తీశారు.

ఇది ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు పూర్తయిందో తెలియదు. సడెన్‌గా రిలీజ్ అన్నారు. ఈ రోజే థియేటర్లలోకి దించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మామగా.. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ అల్లుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన వాళ్లకు కూడా ఇది రుచించలేదు. సింపుల్‌గా ఇది ఔట్ డేటెడ్ సినిమా అని.. ఎస్వీ కృష్ణారెడ్డి పూర్తిగా ట్రెండుకు దూరం అయిపోయారని చూసిన వాళ్లు తేల్చేశారు. కెరీర్లో ఈ దశలో ఉన్న పేరు పోగొట్టుకోవడం, నిర్మాతకు డబ్బులు వృథా చేయడం తప్పితే.. ఎందుకొచ్చిన ప్రయాస అని సినిమా చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.