ఎట్టకేలకు ఓటిటిలో ట్రోలింగ్ సినిమా

గత ఏడాది విపరీతమైన ట్రోలింగ్ కి గురైన సినిమాగా శరవణన్ లెజెండ్ నిలిచిన సంగతి మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ట్రైలర్ చూశాక చాలా మంది థియేటర్ కు వెళ్లే సాహసం చేయలేకపోయారు.

వేల కోట్ల బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి అయిన శరవణ స్టోర్స్ యజమాని నటన మీద మక్కువతో 56 ఏళ్ళ వయసులో ఇంత రిస్క్ చేయడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ దక్కింది. అలా అని దీన్నేమి ఆషామాషీగా తీయలేదు. ఎనభై కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యింది. భారీ క్యాస్టింగ్ తో పాటు విదేశాల్లో షూటింగ్ చేశారు.

పెద్దగా ఆడలేదు కాబట్టి సహజంగానే జనం ఓటిటి కోసం ఎదురు చూశారు. నెలలు గడిచాయే తప్ప ఎంతకీ స్ట్రీమింగ్ డేట్ రాక అసహనానికి గురైన ఫ్యాన్స్ ట్విట్టర్ లో కనిపించారు. వాళ్ళ విన్నపం వినబడిందో ఏమో లెజెండ్ ఫైనల్ గా డిజిటల్ లో వచ్చేసింది.

మార్చి 3 నుంచి హాట్ స్టార్ లో చూడొచ్చంటూ స్వయంగా హీరో కం నిర్మాతే ప్రకటించడంతో అభిమానుల నిరీక్షణకు బ్రేక్ పడింది. ఇంతగా కామెంట్లకు గురైన ఈ చిత్రాన్ని నిజంగా చూస్తారానే సందేహం అక్కర్లేదు. ఎంత సీరియస్ సబ్జెక్టు అయినా సరే నవ్వుకోవడం కోసమైనా షోలు వేసే వాళ్ళు ఉంటారు

ఒకవేళ రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చినా ఆశ్చర్యం లేదు. శరవణన్ ఈ ఒక్క మూవీతో ఆగడం లేదు. త్వరలోనే మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్టుని రెడీ చేసుకుంటున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ కాగానే లెజెండ్ ని మించిన ఖర్చుతో తీస్తారట.

ఈయన హీరో మెటీరియలా అని అడిగిన మీడియాతో ఏం చిరంజీవి రజినీకాంత్ వీళ్లంతా యూతని చూస్తున్నారా అంటూ రివర్స్ లో ప్రశ్నించి కాన్ఫిడెన్స్ చూపించిన శరవణన్ సరసన నటించడానికి ఒప్పుకోవాలే కానీ లైఫ్ లో ఎవరూ ఇవ్వనంత రెమ్యునరేషన్ హీరోయిన్లకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో సోషల్ మీడియా మీమ్స్ కు రెడీ కావాల్సిందే