బ్లాక్ బస్టర్ మిత్రుల వెయిటింగ్ గేమ్

మాములుగా ఏదైనా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకులను బడా సంస్థలు వెంటనే అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేసుకోవడం మాములే. కథ సిద్ధంగా ఉన్నా లేకపోయినా, హీరో ఎవరో తేలకపోయినా జస్ట్ అలా బ్లాక్ చేసుకుని పెట్టుకుంటారు. ఎంత లేట్ అయినా సరే వేరొక నిర్మాతకు కమిట్ కాకుండా తీసుకునే జాగ్రత్త అది. విచిత్రంగా గత నెల వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రూపంలో చిరంజీవి బాలకృష్ణలకు వాళ్ళ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన బాబీ, గోపీచంద్ మలినేని నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ రెండు వచ్చి యాభై రోజులు పూర్తి చేసుకున్నాయి.

ముందుగా బాబీ సంగతి చూస్తే అంత పెద్ద సక్సెస్ అందుకున్నా సరే స్టార్ హీరోలను తనను ఎంచుకోవడంలో లోతుగా ఆలోచిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. వాల్తేరు వీరయ్య రొటీన్ ఫ్లేవర్ లోనే వెళ్ళింది కానీ కేవలం చిరంజీవి టైమింగ్ రవితేజ ఎనర్జీ వల్లే ఆ స్థాయిలో ఆడిందనే విశ్లేషణలు వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. బాబీ సత్తా ఫలానా చోట గొప్పగా ఉందని చెప్పుకునే స్థాయిలో ఒక్క ఇంటర్వెల్ బ్లాక్ మాత్రమే ఎక్కువగా హైలైట్ అయ్యింది. అల్లు అర్జున్ కి కథ చెప్పడానికి గ్రీన్ సిగ్నల్ రావొచ్చనే టాక్ కూడా ఉత్తిదే. పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో అనేది ఇంకా తేలలేదు

ఇక వీరసింహారెడ్డి విషయానికి వస్తే గోపిచంద్ మలినేని దాని సెకండ్ హాఫ్ ని హ్యాండిల్ చేయడంలో తడబడటం ఫలితం మీద ప్రభావం చూపించింది. పెద్ద బాలయ్య ఎలివేషన్లు బ్రహ్మాండంగా చూపించిన మలినేని మలిసగం మాత్రం ఫ్యాన్స్ ని సైతం పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడు. అది సరిగ్గా కుదిరి ఉంటే మరిన్ని రికార్డులు దక్కేవన్న మాట నిజమే. ఇప్పుడు మలినేని ఏ హీరోతో టైఅప్ అవుతాడనేది సస్పెన్స్ గానే ఉంది. చిరంజీవితో కాంబో న్యూస్ లో నిజం లేదు. ఒకప్పుడు కలిసి పనిచేసిన ఈ ఇద్దరు దర్శక మిత్రులు ప్రస్తుతానికి వెయిటింగ్ గేమ్ ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు