శ్రుతి పని పూర్తయింది.. సలార్ ఆన్ ట్రాక్

ప్రభాస్ నుంచి రాబోతున్న కొత్త సినిమాల్లో అభిమానుల దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తున్నది ‘సలార్’యే. ‘ఆదిపురుస్’ మీద ఇప్పటికే చాలా డౌట్లు ఉన్నాయి. దాదాపుగా దానిపై ఆశలు వదిలేసుకున్నారు ఫ్యాన్స్. ‘ప్రాజెక్ట్-కే’ ఎలా ఉంటుందో అంచనా లేదు. ప్రోమోలు రిలీజయ్యాక కానీ ఏం చెప్పలేం. కానీ ‘సలార్’ మాత్రం స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు. అందుక్కారణం.. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ చిత్రాన్ని రూపొందించడమే.

హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో, మాస్ యాక్షన్ దృశ్యాలను తీర్చిదిద్దడంలో ప్రశాంత్ నైపుణ్యం అందరికీ బాగానే అర్థమైంది. ఓ మోస్తరు కథ ఉన్నా చాలు.. ప్రభాస్ లాంటి కటౌట్‌తో అతను అద్భుతాలు చేయగలడని నమ్మతున్నారు అభిమానులు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28కి షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ‘ఆదిపురుష్’ జూన్ 16 నుంచి మళ్లీ వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతుండటం.. ప్రభాస్ ఒకేసారి పలు చిత్రాల్లో నటిస్తుండడంతో ‘సలార్’ అనుకున్నట్లుగా సెప్టెంబరు 28కే వస్తుందా అనే డౌట్లు కొడుతున్నాయి. కానీ ప్రభాస్ ఆలోచన ఎలా ఉందో ఏమో కానీ.. ‘సలార్’ టీం మాత్రం మాత్రం డెడ్ లైన్ దిశగానే అడుగులు వేస్తోంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ శ్రుతి హాసన్ షూటింగ్ పార్ట్ పూర్తయినట్లు అప్‌డేట్ ఇస్తూ సెప్టెంబరు 28నే తమ చిత్రం వస్తుందని మరోసారి ధ్రువీకరించారు. ‘సలార్’లో నటించడం అద్భుత అనుభవం అని పేర్కొంటూ ప్రభాస్, ప్రశాంత్‌లకు థ్యాంక్స్ చెబుతూ శ్రుతి ట్వీట్ కూడా వేసింది. కాబట్టి ‘సలార్’ షూటింగ్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని.. ఈ సినిమా సెప్టెంబరు 28కే ఫిక్స్ అని అభిమానులు ధీమాగా ఉండొచ్చు.