సుకుమార్.. సోషల్ మీడియా కనెక్షన్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్.. 20 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు. ఆయనతో పాటు కెరీర్ మొదలుపెట్టిన దర్శకులు చాలామంది ట్రెండుకు తగ్గట్లు మారలేక, ఔట్ డేటెడ్ అయిపోయి ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు. కొందరు తమ ప్రయాణాన్నే ఆపేశారు. కానీ సుకుమార్ మాత్రం ఇప్పటికీ ట్రెండీగానే సినిమాలు తీస్తున్నారు. ఇప్పటి యువత కూడా ఆయన సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. కాలానుగణంగా మారడం.. అప్‌డేట్ కావడం సుకుమార్ సక్సెస్‌కు కారణాలని చెప్పొచ్చు.

సుకుమార్ దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టే సమయానికి సోషల్ మీడియా లేదు. అప్పటి ప్రమోషన్లు కూడా పూర్తి భిన్నంగా ఉండేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాదే రాజ్యం. ప్రమోషన్ కూడా ప్రధానంగా సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది. సుక్కు సినిమాల్లోని ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుంది.. దాన్ని ఎలా ఊపేస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగేదే అంటున్నాడు సుకుమార్. ప్రస్తుత ట్రెండుకు అనుగుణంగా తాను సోషల్ మీడియాను దృష్టిలో ఉంచుకునే ప్రమోషన్లు చేస్తానని.. తన ప్రతి ఆలోచనా ఆ దిశగానే ఉంటుందని ఆయన చెప్పారు. నేను సినిమాకు సంబంధించి ఒక డైలాగ్ రాసినా, పాట అనుకున్నా.. అవి ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వస్తాయని భావించే ప్లాన్ చేస్తాను. వాటిని దృష్టిలో పెట్టుకునే ఏదైనా చేస్తాను. మనం రాసే డైలాగులు సోషల్ మీడియాలో అభిమానులను ఎంతో ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం చాలామంది రీల్స్, షార్ట్స్‌కు కనెక్టయ్యారు.

‘పుష్ప’ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి అవి కూడా ముఖ్య కారణం. సోషల్ మీడియాలో పుష్ప డైలాగులు, పాటలు ఎంతో వైరల్ అయ్యాయి. సినిమాకు మంచి ఊపు తీసుకొచ్చాయి. ‘పుష్ప-2’ విషయంలోనూ నేను ఆ వ్యూహాన్నే కొనసాగించబోతున్నా. సోషల్ మీడియా దృష్టితోనే అన్నీ ప్లాన్ చేస్తున్నాం అని సుకుమార్ తెలిపాడు.