1000 కోట్లు వచ్చినా వదలమంటున్నారు

షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల సుదీర్ఘమైన గ్యాప్ కి న్యాయం చేస్తూ పఠాన్ సాధించిన బ్లాక్ బస్టర్ రన్ ఏకంగా 1000 కోట్ల గ్రాస్ ని బాక్సాఫీస్ ఖాతాలో జమ చేసింది. అన్ని వెర్షన్లు కలిపి ఈ రోజుతో మైలురాయిని అందుకుంది. దీనికన్నా ముందున్న అమీర్ ఖాన్ దంగల్ ని అతి త్వరలో ఓవర్ టేక్ చేయడం లాంఛనమే. మొదటి రెండు వారాలు విపరీతమైన దూకుడు చూపించిన బాద్షా వీలైనంత వసూళ్లు ఆ టైంలోనే పిండేశాడు. కొత్త రిలీజులు యాంట్ మ్యాన్ 3, షెహజాదా వల్ల డ్రాప్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భయపడితే ఆబ్బె అదేం లేదంటూ వాటి నెగటివ్ టాక్ ని తనకనూలంగా మార్చుకున్నాడు.

సరే సహస్రం వచ్చాయి కానీ ఇంక వదిలేస్తారేమో అనుకుంటే యష్ రాజ్ ఫిలింస్ మాత్రం మెషీన్ లో జ్యూస్ కోసం చెరుకు గడలను వేసి పిప్పి చేసి చివరి బొట్టు వరకు పిండినట్టుగా పఠాన్ నుంచి రావాల్సిన చివరి రూపాయి దాకా వదలే ప్రస్తకే లేదంటున్నారు. అందులో భాగం మొన్న ఫ్రైడే ఒక్క రోజు ఐనాక్స్ పివిఆర్ సినీ పోలీస్ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర కేవలం 112 రూపాయలు పెడితే ప్లాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు దాన్ని పొడిగిస్తూ తిరిగి సోమవారం నుంచి గురువారం దాకా మళ్ళీ 110 రూపాయిలకే చూడొచ్చని ప్రకటించారు.

ఈ ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కానీ ఆల్రెడీ విపరీతమైన లాభాల్లోకి వెళ్లిపోయిన పఠాన్ ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదు. పైగా నార్త్ లో ఇది తప్ప ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. కాబట్టి సహజంగా మళ్ళీ దీన్నే చూడటమో, లేదా ఓటిటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు థియేటర్ వైపు లుక్ వేయడమో జరుగుతుంది. పెద్ద హీరోల సినిమాలకు ఇలా రెండు వారాల తర్వాత స్పెషల్ ఆఫర్లు ఇవ్వడం మంచి పని. మనదగ్గరా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలాంటి వాటికి ఇలా చేసి ఉంటే ఇంకొన్నాళ్ళు హౌస్ ఫుల్స్ పడేవి. తర్వాత వచ్చే వాటికైనా ఆలోచన చేయడం మంచిదే.