తెలుగు దర్శకులంటే అంత అక్కసు ఎందుకో

ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలు చూశాక తెలుగు దర్శకులకు కోలీవుడ్ హీరోలు పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. విజయ్ అంతటి బడా హీరో సైతం దీనికి మినహాయింపు కాలేకపోయాడు. ఇది ఒక వర్గానికి కంటగింపుగా మారడం సహజం.

వారసుడు రిలీజయ్యాక తెలుగు సంగతి పక్కనపెడితే తమిళనాడులో దీనికి హౌస్ ఫుల్ కలెక్షన్లతో పాటు మూడు వందల కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చింది. అయినా టీవీ సీరియల్ లా ఉందంటూ పలు పత్రికల్లో వెబ్ సైట్లలో వంశీ పైడిపల్లిని గట్టిగానే టార్గెట్ చేశారు. కొన్ని ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ కూడా అయ్యాయి.

అంతకు ముందు శివ కార్తికేయన్ ప్రిన్స్ విషయంలోనూ అనుదీప్ పట్ల అనుచితంగా వ్యవహరించిన సోషల్ మీడియా బ్యాచ్ లేకపోలేదు. ఇంతకన్నా క్రింజ్ కామెడీతో తీసిన సీమరాజా లాంటి వాటిని ఎంటర్ టైనర్లని పొగిడిన ఇదే మేధావులు తీరా ప్రిన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మాట మార్చేశారు. ఫలితం అనుకూలంగా రాకపోవడం వేరే సంగతి.

తాజాగా ధనుష్ సర్ అక్కడ వాతిగా రిలీజయ్యింది. ఎమోషన్స్ సరిగా పండలేదని తెలుగు ఫ్లేవర్ ఎక్కువగా ఉందని యథావిధిగా తిరిగి పాత పాట పాడటం మొదలుపెట్టారు. నిజానికి వాతికి పబ్లిక్ రెస్పాన్స్ బాగుందని వసూళ్లు చెబుతున్నాయి.

టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న దర్శకులు తీసిన సినిమాలే పైవన్నీ. పక్క రాష్ట్రంలో ఇతర బాషలోనూ ఋజువు చేసుకోవాలన్న తాపత్రయంతో ఇచ్చిన కమిట్ మెంట్లు. దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం తెలుగు డైరెక్టర్లు కాబట్టి ఇంకా లోతుగా శల్య పరీక్ష చేయాలనుకోవడమే అసలు కామెడీ. అలా అని మన దర్శకులు తీసినవి ఆణిముత్యాలని కాదు. రొట్ట కంటెంట్ తో రజనీకాంత్ లాంటి స్టార్ హీరోనే పెద్దన్న తీసినప్పుడు కూడా ఈ స్థాయిలో విమర్శలు చేయలేదని నెటిజెన్ల అభిప్రాయం. వీటికే ఇలా అంటే మనోళ్లు ఏదైనా బ్లాక్ బస్టర్ కొడితే అప్పుడెలా రియాక్ట్ అవుతారో చూడాలి