స్పేస్ గోలని అఖిల్ భరించగలడా

మాములుగా స్టార్ హీరోలు తమ అభిమానుల ప్రశ్నలకు ట్విట్టర్ లో బదులు చెప్పడం సహజం. ఇందులో ప్రత్యక్షంగా కనిపించడం లాంటివి ఉండవు కాబట్టి దేనికి సమాధానం ఇవ్వాలి దేన్ని వదిలేయాలనే ఆప్షన్లను ముందుగా చూసుకుంటారు. కానీ ఇదే ప్లాట్ ఫార్మ్ లో ఉండే స్పేస్ అలా కాదు. ఒక గ్రూప్ లో సభ్యులు జతకూడి ఆడియో రూపంలో లైవ్ గా సంభాషించుకోవచ్చు. అయితే ఎవరు మాట్లాడాలనేది కంట్రోల్ చేయడానికి అవకాశముంటుంది. కాకపోతే ఎవరు నిజం ఎవరు ఫేక్ అనేది మాత్రం కనిపెట్టలేరు. ఒక్కసారి మొదలయ్యాక ఎవరెవరో జాయినవుతూ ఉంటారు.

దీన్ని అవకాశంగా తీసుకునే యాంటీ ఫ్యాన్స్ పరస్పరం బూతులు తిట్టుకుంటూ గొడవలు పడుతూ నానా రచ్చ చేసిన ఉదంతాలు ఈ మధ్య చాలానే ఉన్నాయి. ఆ స్పేస్ ఆడియో రికార్డింగులు బయటికి వచ్చి వైరల్ అయ్యాయి కూడా. అందుకే మన హీరోలు దీనికి దూరంగా ఉన్నారు. మొదటిసారి అక్కినేని అఖిల్ స్పేస్ ని వాడుకోబోతున్నాడు. ఫిబ్రవరి 22న నేరుగా అభిమానులను ట్విట్టర్ లో పలకరించబోతున్నాడు. నేరుగా చూడకపోయినా వినొచ్చు, ప్లస్ వింటున్న వాళ్ళు మాట్లాడొచ్చు. ఇదంతా ఏజెంట్ ప్రమోషన్ లో భాగమేనని వేరే చెప్పనక్కర్లేదు.

ఇలా చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఏజెంట్ ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. విడుదల తేదీ ప్రకటించారు కానీ పబ్లిసిటీ విషయంలో నిర్మాణ సంస్థ చూపిస్తున్న అలసత్వానికి ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. పైగా అఖిల్ ఇన్నేళ్లయినా ఇది ఇంకా అయిదో సినిమా. ప్యాన్ ఇండియా తీసి కూడా దాన్ని సరైన రీతిలో జనంలోకి తీసుకెళ్లడం లేదన్న అసంతృప్తి వాళ్లలో ఉంది.ఇవన్నీ చల్లారాలి. అందుకే ఎంత గోల ఉన్నా ఫ్యాన్స్ కానివాళ్ళు వచ్చేసి కామెంట్స్ చేసే ఛాన్స్ ఉన్నా సరే అదేంటో చూద్దామని అఖిల్ డిసైడ్ అయ్యాడు. వర్కౌట్ అయితే ఇతర హీరోలూ ఫాలో అవుతారు