సంబ‌రాల మూడ్‌లో తార‌క్ ఫ్యాన్స్

ఈ మ‌ధ్య కాలంలో బాగా ఫ్ర‌స్టేష‌న్లో ఉన్న టాలీవుడ్ ఫ్యాన్స్ అంటే తార‌క్ అభిమానులే. త‌మ హీరో ఏడాదిన్న‌ర నుంచి ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌కుండా ఖాళీగా ఉండ‌డం.. కొర‌టాల శివ‌తో అనుకున్న సినిమా ఎంత‌కీ మొద‌లు కాక‌పోవ‌డంతో వారి ఆవేద‌న మామూలుగా లేదు. చివ‌రికి వారి గొడ‌వ బాగా ఎక్కువైపోయి అమిగోస్ ప్రి రిలీజ్ ఈవెంట్లో తార‌క్ కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

అప్‌డేట్ కోసం అంత గొడ‌వ చేస్తే ఎలా అంటూనే.. కొర‌టాల సినిమాకు నెల‌లోనే ముహూర్తం ఉంటుంద‌ని, వ‌చ్చే నెల‌లో షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించాడు. అన్న ప్రకార‌మే ఈ చిత్ర ప్రారంభోత్స‌వానికి ఈ నెల‌లోనే డేట్ ఫిక్స‌యింది. ఫిబ్ర‌వ‌రి 23న గురువారం మంచి ముహూర్తం ఉండ‌డంతో ఆ రోజే ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించార‌ట‌. వ‌చ్చే నెల మూడో వారంలో షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

ఈ చిత్రాన్ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి కొర‌టాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తార‌క్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ జాన్వి క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

హైద‌రాబాద్‌తో పాటు వైజాగ్, గోవాల్లో మెజారిటీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌పనున్నారు. హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ సెట్ నిర్మాణం జ‌రుపుకుంటుండ‌గా.. అందులోనే తొలి షెడ్యూల్ షూట్ చేయ‌నున్నారు. ఈ చిత్రం పోర్టు నేప‌థ్యంలో సాగుతుంద‌ని సంకేతాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా ముహూర్తం వేడుక గురించి స‌మాచారం బ‌య‌టికి రావ‌డం, అదే స‌మ‌యంలో తార‌క్ కెరీర్లో స్పెష‌ల్ మూవీ అయిన అదుర్స్‌కు స్పెషల్ షోలు ఫిక్స్ కావ‌డంతో అభిమానుల్లో ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. మార్చి 4న అదుర్స్ స్పెష‌ల్ షోలు ప‌డ‌నున్నాయి. దీంతో పాటు మే 20న తార‌క్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని సింహాద్రి స్పెష‌ల్ షోల‌కు కూడా ప్లానింగ్ జ‌రుగుతోంది.