ఎన్టీఆర్‌కు విక్రమ్ కానీ ఓకే చెప్తేనా..

తన కొత్త సినిమా అప్‌డేట్ కోసం సోషల్ మీడియాలో నానా గొడవ చేస్తున్న అభిమానులను సున్నితంగా మందలిస్తూనే.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో హింట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ నెలలోనే ముహూర్తం జరుపుకునే అవకాశం ఉన్న ఈ చిత్రాన్ని మార్చి మధ్యలో సెట్స్ మీదికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ధ్రువీకరించారు.

ప్రస్తుతం ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ పనులను పర్యవేక్షిస్తూనే కాస్టింగ్ సంగతి చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇందులో జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తుందన్నది దాదాపు ఖాయం. ఇక సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పెద్ద నటులను పరిశీలిస్తున్నారు.

‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్ పాత్ర తరహాలో ‘ఎన్టీఆర్ 30’ కోసం ఒక క్యారెక్టర్ డిజైన్ చేశాడట కొరటాల శివ. హీరో తర్వాత ఆ పాత్రకు కథలో అత్యంత ప్రాధాన్యం ఉంటుందట. ఈ పాత్ర కోసం వేరే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ఒకరిని తీసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ప్రస్తుతం తమిళ సీనియర్ హీరో విక్రమ్‌ను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అతను చేస్తే ఈ పాత్రతో పాటు సినిమా వేరే లెవెల్‌కు వెళ్తుందని భావిస్తున్నారట.

మమ్ముట్టి, సైఫ్ అలీ ఖాన్‌ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారట కానీ.. ప్రధానంగా కొరటాల చూపు విక్రమ్ మీదే ఉన్నట్లు సమాచారం. హీరోగా సరైన విజయాల్లో లేడు కానీ.. విక్రమ్‌ది తక్కువ రేంజ్ కాదు. ఇంత పెద్ద సినిమాలో అతను స్పెషల్ రోల్ చేశాడంటే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. మరి చియాన్‌ను ఒప్పించి ఈ సినిమాకు ప్రత్యేకత తీసుకొస్తారేమో చూడాలి.