అన్ని దెబ్బలు తిన్నాడు.. తీరా టైం వచ్చేసరికి

సుధాకర్ చెరుకూరి.. ఈ నిర్మాత తీసింది తక్కువ సినిమాలే అయినా తన పేరు టాలీవుడ్లో బాగానే పాపులర్. నిర్మాతగా కమర్షియల్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీశారీయన. కానీ బాక్సాఫీస్ మాత్రం ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా ఇప్పటిదాకా సుధాకర్ బేనర్ నుంచి వచ్చిన నాలుగు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి.

డిఫరెంట్ సినిమాలు తీయాలనే ప్రయత్నం మంచిదే అయినా.. అవి జనరంజకంగా లేకపోవడంతో చేదు అనుభవాలు తప్పలేదు సుధాకర్‌కు. గత అనుభవాలు ఎలా ఉన్నా.. మరోసారి సాహసానికి పూనుకున్నాడాయన. నేచురల్ స్టార్ నాని హీరోగా అతడి మార్కెట్‌కు మించి ఖర్చు పెట్టి ఈ సినిమా తీశాడు సుధాకర్. బడ్జెట్ దాదాపు రూ.70 కోట్లని సమాచారం.

ఐతే ఒక హీరో మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టేసినపుడు రిలీజ్ కంటే ముందు సేఫ్ అవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. కాస్త టెంప్టింగ్ ఆఫర్ రాగానే హక్కులు అమ్మేస్తుంటారు. సుధాకర్ సైతం అదే చేశాడు. ‘దసరా’ థియేట్రికల్ హక్కుల్ని చాలా ముందుగానే రూ.23 కోట్లకు అమ్మేశాడు. డీల్ జరుగుతున్నపుడు మంచి రేటే అనిపించింది సుధాకర్‌కు. కానీ రిలీజ్ టైంకి పరిస్థితి మారిపోయింది. సినిమాకు మంచి హైప్ రావడంతో ఆల్రెడీ హక్కులు కొన్న వ్యక్తి దగ్గర్నుంచి దిల్ రాజు ఐదు కోట్లు ఎక్కువకు రైట్స్ తీసుకున్నాడని సమాచారం.

ఐతే టీజర్ రిలీజ్ అయ్యాక ట్రేడ్ వర్గాల అంచనాలను బట్టి చూస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది. దీంతో సుధాకర్ గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యాడనే చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. ఇప్పటిదాకా సుధాకర్ తాను నిర్మించిన సినిమాలన్నింటితో నష్టాలే ఎదుర్కొన్నాడు. సొంతంగా రిలీజ్ చేసుకుని ఉంటే ఆ నష్టాల్ని ‘దసరా’తో భర్తీ చేసుకునే అవకాశముండేదని.. కానీ సేఫ్ అయిపోదామనే ఆశతో చాలా ముందే రైట్స్ ఇచ్చేయడం ద్వారా మంచి అవకాశాన్ని మిస్సయ్యారని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.