ఓటిటి టాక్ షో కోసం ఇంత క్రేజా

బాలకృష్ణ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో క్లైమాక్స్ కు వచ్చేసింది. ఫినిషింగ్ టచ్ పవర్ ఫుల్ గా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తో సెట్ చేసిన ఎపిసోడ్ ఇప్పటికే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రభాస్ తో ఇంటర్వ్యూ ఏకంగా ఆహా యాప్ ని క్రాష్ చేసిన నేపథ్యంలో ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా టెక్నికల్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహా టీమ్ ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. సాంకేతిక బృందంతో ప్రెస్ మీట్ నిర్వహించడంతో పాటు మొదటిసారి అఫీషియల్ ట్విట్టర్ డిపిగా పవన్ ఫోటోని పెట్టింది.

విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద బాలయ్య పవన్ ల నిలువెత్తు కటవుట్ ఒకటి పెట్టించి పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. అదే హాలులో ఈ ఎపిసోడ్ ని లైవ్ స్క్రీనింగ్ చేస్తారనే టాక్ ఉంది. మాములుగా ఒక ఓటిటి టాక్ షో ఈ స్థాయిలో హంగామా చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. మరోవైపు దీనికి రికార్డు స్థాయిలో ఆదాయం, వ్యూస్ రావాలనే ఉద్దేశంతో ఫ్యాన్స్ ఇప్పటిదాకా ఆహా చందాలు తీసుకోని వాళ్ళను వెంటనే కొనేలా ప్రోత్సహిస్తున్నారు. మిగిలిన ఓటిటిలతో పోలిస్తే సబ్క్రిప్షన్ మొత్తం తక్కువ కాబట్టి ఈజీగా భారీ నెంబర్ ని నమోదు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

ఒకవేళ కంటెంట్ కనక హైప్ కు తగ్గట్టు ఉంటే నిజంగానే మిలియన్ల వ్యూస్ హోరెత్తడం ఖాయం. భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ పవన్ సంపూర్ణ దర్శనం అభిమానులకు కలగలేదు. ఇప్పుడీ అన్ స్టాపబుల్ షో ద్వారా ఎంత లేదన్నా టూ పార్ట్స్ కలిపి రెండు గంటలకు పైగానే పవర్ స్టార్ ని చూడబోతున్నారు. పవన్కు తోడు సాయి ధరమ్ తేజ్ లాంటి ప్రత్యేక ఆకర్షణలు తోడవ్వడంతో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. పెళ్లిళ్ల వ్యవహారం, చిరంజీవితో బాండింగ్, రాజకీయాలు, వరస సినిమాలు, గతం తాలూకు షాక్ ఇచ్చే జ్ఞాపకాలు ఇలా ఎన్నో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు మధ్య చర్చకు రాబోతున్నాయి.