చిరు చేద్దాం అంటే సరిపోదు

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు ఉత్సాహంలో లేడు. సంక్రాంతికి విడుదలైన ఆయన కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లింది. గత ఏడాది ‘ఆచార్య’ షాక్‌, ‘గాడ్ ఫాదర్’ అసంతృప్తి తర్వాత చిరుకు ‘వాల్తేరు వీరయ్య’ గొప్ప ఉపశమనం అనడంలో సందేహం లేదు. ఈ ఊపులో ‘భోళా శంకర్’ను చకచకా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు చిరు. దీని తర్వాత చిరు చేయబోయే సినిమా గురించి క్లారిటీ లేదు.

ముందు అనుకున్న ప్రకారం అయితే వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి నటించాల్సింది. కానీ స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు చిరు. ఇప్పుడు కొత్త ఆప్షన్ల కోసం చూస్తున్నాడు మెగాస్టార్. ఆయన పరిశీలనలోకి త్రినాథరావు నక్కిన పేరు వచ్చినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.

‘స్టార్ డైరెక్టర్’ అనిపించుకోలేదన్న మాటే కానీ.. త్రినాథరావుకు టాలీవుడ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. తొలి ప్రయత్నంగా చేసిన ‘మేం వయసుకు వచ్చాం’ అనే చిన్న సినిమా అంతగా ప్రేక్షకుల దృష్టిలో పడలేదు కానీ.. ఆ తర్వాత త్రినాథరావు చేసిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా వరుసగా పెద్ద హిట్లే అయ్యాయి. తాజాగా ‘ధమాకా’తో వంద కోట్ల గ్రాస్ సినిమాను అందించి తన పేరు మార్మోగేలా చేశాడు త్రినాథరావు. ఆ సినిమాలో రవితేజను మాస్ మెచ్చేలా ప్రెజెంట్ చేయడం చూసి త్రినాథరావుకు చిరు సినిమా ఆఫర్ చేశాడంటున్నారు. త్రినాథరావు కూడా ప్రాథమికంగా ఒక లైన్ చెప్పి చిరును ఇంప్రెస్ చేశాడట.

ఐతే చిరు ఆషామాషీగా ఏ స్క్రిప్టునూ ఓకే చేయడు. పూరి జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకుడే ‘ఆటోజానీ’ కథతో చిరును ఇంప్రెస్ చేయలేక మధ్యలో కాడి వదిలేశాడు. ఇక యువ దర్శకుడు వెంకీకి ఇలాగే ముందు ఓకే చెప్పడం.. పూర్తి స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందక ఆ సినిమాను పక్కన పెట్టేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడిగా మారుతున్న తన ఆస్థాన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ సహకారం కూడా లేకుండా త్రినాథరావు చిరును పూర్తి స్క్రిప్టుతో మెప్పించి సినిమాను ముందుకు తీసుకెళ్లగలడా అన్నది ప్రశ్న.