జవాన్ హక్కుల కోసం ఎగబడుతున్నారు

నాలుగేళ్ల గ్యాప్ తో వచ్చిన షారుఖ్ ఖాన్ మహా అయితే ఓ హిట్టు కొడతాడేమో అనుకుంటే ఏకంగా బాక్సాఫీస్ దద్దరిల్లిపోయేలా ఇండస్ట్రీ రికార్డులు జేబులో వేసుకోవడంతో నార్త్ డిస్ట్రిబ్యూటర్ల ఆనందం మాములుగా లేదు. నాలుగు రోజులుగా హౌస్ ఫుల్స్ తో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. నెంబర్ల గురించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ పది ఇరవై ఎక్స్ ట్రా కలపడం అందరూ చేసేదే కాబట్టి అదేమంత సీరియస్ ఇష్యూ కాదు. రోజుకు కనీసం వంద కోట్లు తీసుకోనిదే పఠాన్ షోలు పూర్తవ్వడం లేదు. ముంబై, జైపూర్, పూణే లాంటి నగరాల్లో జనసందోహాన్ని తట్టుకోలేక అదనపు షోలు ఎన్ని వేస్తున్నా తక్కువ పడుతున్నాయి.

ఇదంతా నెక్స్ట్ కింగ్ ఖాన్ చేస్తున్న జవాన్ కు అనూహ్య వరంగా మారింది. ఇంకా షూటింగ్ పూర్తవ్వకుండానే హక్కుల కోసం పంపిణీదారులు, శాటిలైట్ ఛానళ్లు భారీ ధరలను కోట్ చేస్తున్నాయి. ఓటిటి ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఒత్తిడేమీ లేదు కానీ ఓవర్సీస్ రైట్స్ కోసం వస్తున్న డిమాండ్ చూసి స్వయానా జవాన్ కు నిర్మాతైన షారుఖ్ కు నోట మాట రావడం లేదట. ముందు వేసుకున్న లాభాల లెక్కలకు ఇప్పుడు వస్తున్న ఆఫర్లను పోల్చి చూసుకుంటే కనీసం ముప్పై నుంచి యాభై శాతం దాకా అదనంగా రాబడి పెరగనున్నట్టు ముంబై మీడియా టాక్.

తమిళ దర్శకుడు ఆట్లీ తీస్తున్న జవాన్ లో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నయనతార మొదటిసారి జట్టు కడుతోంది. విజయ్ సేతుపతి విలన్ గా ఆల్రెడీ జాయినయ్యాడు. విజయ్ చిన్న క్యామియో చేయడం దాని షూట్ పూర్తవ్వడం కూడా జరిగిపోయింది. అనిరుద్ రవిచందర్ ట్యూన్స్ ఓ రేంజ్ లో వస్తన్నాయట. ఇన్ని స్పెషల్స్ ఉన్నప్పుడు బయ్యర్లు ఎగబడటంలో ఆశ్చర్యం ఏముంది. జవాన్ కూడా పఠాన్ లాగే మల్టీ లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేస్తున్నారు. జూన్ 2 విడుదల తేదీని ఆల్రెడీ అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి కేవలం ఆరు నెలల గ్యాప్ లోనే బాద్షా డబుల్ ధమాకాని ఎంజాయ్ చేయొచ్చు.