షారుఖ్ సినిమాను కంగనా పొగిడిందండోయ్

షారుఖ్ ఖాన్ ఒక బాలీవుడ్ నటుడు.. కంగనా రనౌత్ ఒక బాలీవుడ్ నటి. అతడి సినిమాను ఆమె పొగడ్డంలో విశేషం ఏముంది? ఒక హీరో కొత్త సినిమా రిలీజైనపుడు ఇండస్ట్రీలో ఉన్న మిగతా వాళ్లు దాన్ని ఆహా ఓహో అంటూ కొనియాడడం మామూలే కదా? అని కొంతమందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ కంగనా రనౌత్ వ్యవహారం తెలిసిన వాళ్లకు మాత్రం ఇది ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

ఎందుకంటే తనకంటూ ఒక ఇమేజ్ వచ్చి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కొన్ని హిట్లు పడ్డాక కంగనా బాలీవుడ్లో సహచర నటీనటుల్ని, దర్శక నిర్మాతల్ని ఎలా ఏకి పడేస్తూ వచ్చిందో తెలిసిందే. బాలీవుడ్‌ను దశాబ్దాలుగా ఏలుతున్న ప్రముఖులందరినీ వరుసబెట్టి టార్గెట్ చేస్తూ వచ్చిందామె. ఎవరైనా పెద్ద హీరో సినిమా ఒకటి తేడా కొడితే చాలు, దాని గురించి వెటకారపు వ్యాఖ్యలు చేయడం.. బాలీవుడ్‌ను తక్కువ చేసి సౌత్ సినిమాలను కొనియాడడం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే పడని సినీ ప్రముఖులను టార్గెట్ చేయడం.. ఇదీ రెండు మూడేళ్లుగా కంగనా వరస.

ఐతే ఒక దశ దాటాక కంగనా విమర్శలు, ఆరోపణలు శ్రుతిమించిపోవడంతో జనాలకు ఒళ్లు మంచి ఆమెకు గట్టి షాకే ఇచ్చారు. గత ఏడాది కంగనా నుంచి వచ్చిన ‘ధకడ్’ అనే సినిమాను అస్సలు పట్టించుకోలేదు. ఆ సినిమా దారుణమైన ఫలితాన్నందుకుంది బాక్సాఫీస్ దగ్గర. సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే.. కంగనా తీరు నచ్చక కనీస స్థాయిలో కూడా జనాలు ఆ సినిమా చూసేందుకు వెళ్లలేదు. దీంతో కంగనాకు బాగానే జ్ఞానోదయం అయినట్లుంది. నెగెటివిటీ తగ్గించుకునే పనిలో పడింది.

ఈ క్రమంలోనే భారీ ఓపెనింగ్స్ తెచ్చకున్న షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ మీద ఆమె ప్రశంసలు కురిపించింది. ‘పఠాన్’కు మంచి వసూళ్లు వస్తున్నాయని.. ఇలాంటి సినిమాలు బాగా ఆడాల్సిన అవసరముందని ఆమె వ్యాఖ్యానించింది. ఈ మధ్య హిందీ సినిమా ట్రాక్ తప్పిందని.. మళ్లీ బాలీవుడ్ పునర్వైభవం సాధించేందుకు అందరూ కష్టపడుతున్నారని ఆమె పేర్కొంది. ఒక్క రోజు ముందు బాలీవుడ్ మోజులో పడి దెబ్బ తింటోందంటూ కామెంట్లు చేసిన ఆమె.. తర్వాతి రోజు షారుఖ్ సినిమాను పొగడ్డం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.