వెంకీ 75.. రేంజే మారిపోయింది

25.. 50.. 75.. 100.. స్టార్ హీరోల కెరీర్లలో సినిమాల పరంగా ఇలాంటి మైలురాళ్ల దగ్గరికి వచ్చినపుడు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఐతే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమా గురించి మొన్నటిదాకా అసలే చర్చా లేదు. మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ లాగా వెంకీ అభిమానులు పెద్ద హడావుడి చేసే రకం కాదు.

వెంకీ సైతం తన గురించి తాను డబ్బా కొట్టుకోవడం, పెయిడ్ ప్రమోషన్లు చేసుకోవడం, మైల్ స్టోన్ మూవీ టైం వచ్చినపుడు హడావుడి చేయడం లాంటి వాటికి దూరంగా ఉంటాడు. అందుకే ఆయన 75వ సినిమా గురించి వారం ముందు వరకు కూడా ఏ డిస్కషన్ లేదు. అసలు వెంకీ ఈ మైలురాయి ముంగిట ఉన్నాడన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఈ సినిమా ఎవరో ఉంటుందో క్లారిటీ కూడా లేదు.

కానీ సడెన్‌గా ‘హిట్’ ఫ్రాంఛైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో వెంకీ 75వ సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి ‘సైంధవ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీంతో పాటే ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ కూడా లాంచ్ చేశారు. ఆ టీజర్ చూడగానే ఒక్కసారిగా జనాలకు సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. వెంకీ బెస్ట్ లుక్‌లో కనిపించడం.. ఆయన పాత్ర, కథ అన్నీ ఆసక్తికరంగా అనిపించడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఖరారవడంతో ఇంకో మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో సినిమా చేయడానికి అంగీకరించాడంటేనే క్యారెక్టర్ ఒక రేంజిలో ఉంటుందని అంచనా వేయొచ్చు. వెంకీ-నవాజ్ కాంబినేషన్ అమితాసక్తిని రేకెత్తించేదే. ఇందులో ఒక హీరో కీలక పాత్ర చేస్తాడని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘వెంకీ 75’ చాలా స్పెషల్‌గా ఉండబోతోందని, దాని రేంజే వేరని స్పష్టంగా తెలుస్తోంది.