చిరుకు ఇప్పటికైనా అర్థమైందా?


పాతికేళ్లకు పైగా టాలీవుడ్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయ అరంగేట్రంతో సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. పదేళ్ల విరామం తర్వాత ఆయన 2017లో ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. చిరు పునరాగమన చిత్రం కాబట్టి ఆ సినిమా బాగానే ఆడింది కానీ.. మెగాస్టార్ అందులో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేశారా అంటే ఔనని చెప్పలేని పరిస్థితి.

ఇక కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచిన ‘సైరా’ అభిమానులకు మిశ్రమానుభూతిని మిగిల్చింది. చిరు క్యారెక్టర్, లుక్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తర్వాతి సినిమా ‘ఆచార్య’ అన్ని రకాలుగా నిరాశకు గురి చేసింది. ‘గాడ్ ఫాదర్’ సైతం అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది. ఇప్పుడిక ‘వాల్తేరు వీరయ్య’ వంతు వచ్చింది. ఈ సినిమా కూడా డివైడ్ టాక్‌తో మొదలైనప్పటికీ అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సినిమా ఆడేస్తోందని అనుకుంటే పొరబాటే. ఈ చిత్రంతో చిరు అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు కూడా బాగానే కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది.

రీఎంట్రీలో చిరు పాత్ర, నటన వరకు అత్యంత సంతృప్తినిచ్చిన సినిమా ఇదే అంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే చిరు కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు కూడా ఎంటర్టైనర్లతోనే ఆయన మెగా హిట్లు కొట్టారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు.. ఈ సినిమాలన్నింట్లోనూ చిరు కామెడీ ప్లస్ యాక్షన్‌తోనే ఎక్కువ ఆకట్టుకున్నారు. ఇక ‘అన్నయ్య’, ‘శంకర్ దాదా’ లాంటి చిత్రాల్లో చిరు ఏ రేంజిలో ఎంటర్టైన్ చేశాడో.. ఆ సినిమాలకు ఆయన పాత్ర, తన హావభావాలు, కామెడీ టైమింగ్ ఎంత ప్లస్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లో తన పాత సినిమాలను గుర్తు చేస్తూ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు చిరు. యాక్షన్ పరంగానూ ఆయన ఆకట్టుకున్నారు. దీన్ని బట్టి తేలిందేమంటే.. చిరు సందేశాల జోలికి వెళ్లకుండా.. సీరియస్ పాత్రలను టచ్ చేయకుండా.. కేవలం యాక్షన్ ప్రధాన సినిమాలు చేయకుండా.. ఎంటర్టైనర్లను ఎంచుకుంటే బెటర్. ఒకప్పుడైనా, ఇప్పుడైనా చిరును అభిమానులతో సహా సగటు ప్రేక్షకులు ఎంటర్టైనింగ్ రోల్స్‌లోనే చూడాలని అనుకుంటారనడంలో సందేహం లేదు.