నెట్ ఫ్లిక్స్ ముప్పేటదాడి వెనుక అసలు కథ

ఒకపక్కేమో టాలీవుడ్ నిర్మాతలు థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ తగ్గాలని డిమాండ్ చేస్తారు. షూటింగులు ఆపి మరీ చేసిన నిరసనల్లో ఇకపై డిజిటల్ పార్ట్ నర్స్ ని ఎక్కువ హై లైట్ చేయకుండా ఎనిమిది వారల తర్వాత స్ట్రీమింగ్ ఉండేలా నిర్ణయాలు తీసుకుంటారు.

కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ తాము కొనుగోలు చేసిన కొత్త తెలుగు సినిమాల హక్కుల గురించి ఇచ్చిన వరస ప్రకటనలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇందులో షూటింగ్ సగం అయినవి చివరి దశలో ఉన్నవి అసలు ఇంకా సెట్లకు పైకి వెళ్లనవి కూడా ఉండటం అసలు ట్విస్టు.

చిరంజీవి భోళా శంకర్, మహేష్ బాబు 28, కళ్యాణ్ రామ్ అమిగోస్, నాని దసరా, సిద్దు టిల్లు స్క్వేర్, కిరణ్ అబ్బవరం మీటర్, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, వైష్ణవ్ తేజ్ 8, నిఖిల్ 18 పేజెస్, బుట్టబొమ్మ, బడ్డీ, వరుణ్ తేజ్ 12 ఇలా మొత్తం పదిహేడు అనౌన్స్ మెంట్లతో షాక్ ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ ఇవ్వలేదు.

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న వాటి గురించి యాడ్స్ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్నవాటిని కూడా మేం కొనేసుకున్నాం అని చెప్పడం వల్ల సగటు కామన్ ఆడియన్స్ కి ఇది ఎలాగూ ఓటిటిలో వస్తుంది కదానే అభిప్రాయం కలిగినప్పుడు దాని ప్రభావం థియేటర్ కు వెళ్లే నిర్ణయం మీద ఉంటుంది

కానీ ఇలా చేయడం వెనుక నెట్ ఫ్లిక్స్ ప్లానింగ్ వేరే ఉంది. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లు అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే ఇండియాలో తక్కువగా ఉన్నారు. అందులోనూ సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉండే సౌత్ మార్కెట్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే ఉద్దేశంలో ఇలా గంపగుత్తగా వందల కోట్లను పెట్టుబడిగా పెట్టేసి వాటి హక్కులు కొనేస్తోంది.

భారీ రేట్లకు మూడు చిరంజీవి సినిమాలను కొనుగోలు చేయడమే దానికి ఉదాహరణ. నెట్ ఫ్లిక్స్ ఉద్దేశం ఏదైనప్పటికీ ఇది మరో రూపంలో కొత్త సినిమాల ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.అగ్రిమెంట్ల టైంలో ప్రొడ్యూసర్లు ఈ అంశం మీద దృష్టి సారించడం అవసరం